యువతి కిడ్నాప్, తరచూ రేప్: నిందితుడికి పదేళ్ళ జైలు
పోలీసుల కథనం ప్రకారం.. రాజస్థాన్కు చెందిన రాజేష్(26) అనే నిందితుడు 2010, మేలో బాధిత యువతిని కిడ్నాప్ చేసి, అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత పాలెంలోని తన సోదరి ఇంట్లో బాధిత యువతిని నిర్బంధించాడు. ఆమెపై తరచూ అత్యాచారానికి పాల్పడ్డాడు. కాగా, రాజేష్ సోదరి, బావలు ఆ యువతికి మత్తు పదార్థం ఇచ్చి వ్యభిచార కూపంలోకి నెట్టేందుకు ప్రయత్నించారు.
అనంతరం ఓ అద్దె గదిలోకి యువతిని బంధించిన రాజేష్, అక్కడ కూడా ఆమెపై తరచూ అత్యాచారానికి పాల్పడ్డాడు. కాగా, ఎలాగోలా బయటపడ్డ బాధిత యువతి పోలీసులను ఆశ్రయించింది. విచారణ జరిపిన పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేసి, ఐపిసి సెక్షన్స్ 376, 363, 120 బి కింద కేసులు నమోదు చేశారు. తాను ఆమెపై అత్యాచారానికి పాల్పడలేదని, తమ మధ్య సంబంధం ఉందని తెలిపాడు.
తనను అనవసరంగా కేసులో ఇరికించారని ఆరోపించాడు. అయితే కేసుకు సంబంధించిన ఇతర ఆధారాలు, బాధితురాలి వాదన విన్న కోర్టు రాజేష్కు పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. తనను బలవంతంగా కిడ్నాప్ చేసి, తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని బాధిత యువతి కోర్టుకు, పోలీసులకు తెలిపింది.