పెళ్లిచూపులు: విలన్ బయటకు వచ్చాడు
న్యూఢిల్లీ: ప్రేమించిన అమ్మాయితో పెళ్లి చేయ్యాలి, లేదంటే అమ్మాయి అక్క కొడుకును చంపేస్తానని బెదిరించిన యువకుడిని న్యూఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. బీహార్ లో అతని దగ్గర బందీగా ఉన్న బాలుడిని క్షేమంగా రక్షించారు.
బీహార్ లోని బాగల్నూర్ జిల్లాలోని హిరాన్ కుద్నా అనే గ్రామంలో పింటూ కుమార్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. అతడు ఓ పెళ్లిలో ఓ యువతిని చూసి మనసుపారేసుకున్నాడు. దీంతో అమ్మాయిని ఎలాగైనా సొంతం చేసుకోవాలని ఆలోచించాడు.
అమ్మాయి బావను పరిచయం చేసుకుని స్నేహం చేశాడు. అమ్మయి అక్కతో పరిచయం పెంచుకున్నాడు. ఒక నెల తరువాత వారితో పాటు ఢిల్లీకి మకాం మార్చాడు. కొంతకాలం తరువాత నేను మీ అమ్మాయిని ప్రేమిస్తున్నానని, తనకు ఇచ్చి వివాహం చెయ్యాలని వారి కుటుంబ సభ్యులకు చెప్పాడు.
పింటూ కుమార్ కు ఏ ఉద్యోగం లేకపోవడంతో అమ్మాయిని ఇచ్చి వివాహం చెయ్యడానికి వారు నిరాకరించారు. అంతే పింటూ కుమార్ రెచ్చిపోయాడు. నచ్చిన అమ్మాయిని ఎలాగైనా సొంతం చేసుకోవాలని ఆలోచించాడు.
అప్పటి వరకు అమాయకంగా ఉన్న పింటూ కుమార్ లో విలన్ బయటకువచ్చాడు. అమ్మాయి అక్కకు ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు. గుట్టుచప్పుడు కాకుండ ఈనెల 14వ తేది స్కూల్ దగ్గర ఆ అబ్బాయిని కిడ్నాప్ చేసి బీహార్ పారిపోయాడు.
తరువాత ఎస్ టీడీ బూత్ నుంచి అమ్మాయి బావకు ఫోన్ చేశాడు. తనకు మీ మరదలిని ఇచ్చి పెళ్లి చెయ్యాలని, లేదంటే బాలుడిని చంపేస్తానని బెదిరించాడు. అబ్బాయి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు పక్కా ప్లాన్ వేసుకుని అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తామని పింటూ కుమార్ కు చెప్పారు. బీహార్ లో అతను ఉన్న ప్రాంతం గుర్తించారు. చివరికి పింటూ కుమార్ ను అరెస్టు చేసి బాలుడిని రక్షించామని పోలీసులు తెలిపారు.