మంజుషా అనుమానాస్పద మృతి: 15 రోజుల్లోనే ముగ్గురు యువ నటీమణుల మరణాల కలకలం
కోల్కతా: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో వరుసగా యువ నటీమణుల అనుమానాస్పద మరణాలు కలకలం రేపుతున్నాయి. కేవలం 15 రోజుల్లోనే దాదాపు ఒకే రంగానికి చెందిన ముగ్గురు యువతులు అనుమానాస్పద స్థితిలో మరణించడం గమనార్హం. తాజాగా ఓ మోడల్ కోల్కతాలోని తన నివాసంలో అనుమానాస్పాదంగా ప్రాణాలు కోల్పోయారు.
తన అపార్ట్మెంట్లోనే శవమై కనిపించిన మంజుషా నియోగి
కోల్కతా నగరంలోని పటులి ప్రాంతంలోని నివాసంలో నటి, మోడల్ మంజుషా నియోగి శుక్రవారం శవమై కనిపించిందని పోలీసులకు సమాచారం అందించింది. రెండు రోజుల క్రితం తన స్నేహితురాలు, సహోద్యోగి బిదిషా డి మజుందార్ మరణించిన తర్వాత ఆమె "తీవ్రమైన డిప్రెషన్"తో బాధపడుతున్నట్లు మంజుషా తల్లి పేర్కొంది.
నటి బిదిషా మజుందార్ మరణంతో నిరాశలోకి మంజుషా
నటి కూడా అయిన బిదిషా మజుందార్కు బ్రైడల్ మేకప్ ఫొటోషూట్స్లో మంచి పేరుంది. కాగా, బుధవారం సాయంత్రం బిదిషా కోల్కతాలోని డమ్ డమ్ ప్రాంతంలో తాను అద్దెకుంటున్న అపార్ట్మెంట్లో విగత జీవిగా కనిపించింది. ఈ నేపథ్యంలోనే మంజుషా నియోగి అనుమానాస్పద స్థితిలో మరణించడం కలకంగా మారింది.
మంజుషా నియోగి మృతదేహాన్ని పోస్టుమార్టం, ఫొరెన్సిక్ పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి పంపించామని పోలీసులు తెలిపారు. తన స్నేహితురాలు బిదిషా మరణించిన నాటి నుంచి తన కూతురు మంజుషా తీవ్ర నిరాశలోకి వెళ్లిపోయిందని ఆమె తల్లి తెలిపారు. అప్పట్నుంచి మంజుషా ఎప్పుడూ బిదిషా గురించే మాట్లాడుతుండేదని చెప్పారు.
తన అపార్ట్మెంట్లోనే ఉరివేసుకున్న బిదిషా డే మజుందార్
మే 25న బిదిషా డే మజుందార్ తన అపార్ట్మెంట్లో ఉరివేసుకుని కనిపించింది. దీంతో పోలీసులు తలుపులు బగలగొట్టి బిదిషా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బిదిషాది హత్య, ఆత్మహత్యా అనేది పూర్తి దర్యాప్తు అనంతరం తేలే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.
ప్రముఖ టీవీ నటి పల్లబి డే అనుమానాస్పద మృతి
కాగా, 15 రోజుల్లో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం ఇది మూడోది కావడం గమనార్హం. ప్రముఖ టీవీ నటి పల్లబి డే కూడా 15 రోజుల క్రితం ఇలాంటి పరిస్థితుల్లోనే మృతి చెందారు. కోల్కతాలోని గర్ఫా ప్రాంతంలోని తాను ఉంటున్న అద్దె అపార్ట్మెంట్లోనే పల్లబి డే కూడా అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ మూడు ఘటనలపై దర్యాప్తు కొనసాగుతోంది.