నెహ్రూను అంతమొందించేందుకు కుట్రలు: సర్దార్ పటేల్ చెప్పిందేమిటి..?
న్యూఢిల్లీ: దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ 130వ జయంతి సందర్భంగా దేశం యావత్తు ఆయనకు నివాళులు అర్పించి ఆయన ప్రవేశపెట్టిన సామాజిక ఆర్థిక విధానాలను కొనియాడుతోంది. తొలిప్రధానిగా జవహర్లాల్ నెహ్రూ ఇటు దేశంలోను అటు విదేశాల్లోనూ ఎంతో పాపులారిటీ సంపాదించారు. అలాంటి మహోన్నతమైన స్థానంలో పనిచేసిన ఒక వ్యక్తిపై కుట్రలు జరగడం సాధారణమే. జవహర్లాల్ విషయంలో కూడా కుట్రలు కుతంత్రాలు జరిగాయి. ఆయన్ను అంతమొందించేందుకు కొన్ని దుష్ట శక్తులు ప్రణాళిక రచించాయి. ఇంతకీ నెహ్రూను అంతమొందించాలని ఎవరు అనుకున్నారు..?
నెహ్రూను అంతమొందించేందుకు వరుస కుట్రలు
జాతిపిత మహాత్మాగాంధీ 1948లో హత్యకు గురయ్యాక, నెహ్రూ జీవితం కూడా ప్రమాదంలో పడింది. ఈ విషయం ఎవరో చెప్పింది కాదు.. దేశ తొలి హోంమంత్రిగా పనిచేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ చెప్పారు.మహాత్మాగాంధీ హత్యకు గురైన తర్వాత నెహ్రూ ప్రాణాలకు కూడా ముప్పు ఉందని భావించి రాత్రింపగళ్లు వల్లభాయ్ పటేల్ చాలా అలర్ట్గా ఉండేవారని ఆయన కూతురు మనిబెన్ చెప్పారు. ఏప్రిల్ 1950లో ఈ విషయం పటేల్ తనకు చెప్పినట్లుగా మనిబెన్ వెల్లడించారు. ముస్లిం హక్కుల కోసం నెహ్రూ పోరాడేవాడని ఆ క్రమంలో తన ప్రాణాలకు ముప్పు ఉంటుందని ఎంతో జాగురతతో ఉండేవాడినని పటేల్ చెప్పినట్లు ఆయన కుమార్తె వివరించారు.
బీహార్లో నెహ్రూపై తొలి హత్యాయత్నం జరిగింది
జవహర్లాల్ నెహ్రూపై తొలి హత్యాయత్నం జరిగిన తర్వాత రెండేళ్లకు సర్దార్ పటేల్ దీని గురించిన వివరాలను బహిర్గతం చేశారు. 1948లో బీహార్ పోలీసులు లఖిసారీ ప్రాంతం నుంచి ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. మొత్తంగా నలుగురు ఉండగా అందులో నాలుగో వ్యక్తి నెహ్రూపై హత్యాయత్నం జరుగుతుందని సమాచారం ఇవ్వడంతో ముగ్గురిని పోలీసలు అరెస్టు చేసినట్లు పటేల్ చెప్పారు. ముగ్గురు వ్యక్తులు కత్తుల పట్టుకుని నెహ్రూను, పటేల్ను అంతమొందించేందుకు ఢిల్లీకి బయలుదేరారని సమాచారం ఇచ్చాడు. ఇదే విషయాన్ని నాడు ప్రధాన పత్రికలు ప్రచురించాయి. ఢిల్లీలో నెహ్రూను, పటేల్ను అంతమొందించేందుకు మారణాయుధాలు, బాంబులు, రైఫిళ్లు అప్పటికే సిద్ధమైనట్లు పోలీసులు చెప్పారు.
పార్లమెంటులో పటేల్ ప్రకటన
నెహ్రూను అంతమొందించాలన్న కుట్రను భగ్నం చేసిన రెండేళ్లకు సర్దార్ వల్లభాయ్ పటేల్ పార్లమెంటులో ప్రకటన చేశారు. 1950 ఆగష్టులో ఆయన ప్రకటన చేశారు. మహాత్మాగాంధీని హత్య చేసిన వారే ఆ వర్గానికి చెందినవారే నెహ్రూను కూడా చంపాలని భావించారని పటేల్ ప్రకటన చేశారు. వారి పేర్లను కూడా ప్రస్తావించారు పటేల్. ఆలిండియా హిందూ మహాసభకు చెందిన మాజీ అధ్యక్షుడు ఎల్పీ భోపట్కార్ నెహ్రూను చంపాలని భావించినట్లు ఈ విషయాన్ని తానే ఒప్పుకున్నట్లు పటేల్ చెప్పారు. అప్పటి తూర్పు పాకిస్తాన్ నేటి బంగ్లాదేశ్లో అల్లర్లు జరిగిన నేపథ్యంలో నెహ్రూను అంతమొందించాలని భోపాట్కార్ కుట్ర పన్నినట్లు పటేల్ సభలో చెప్పారు. పటేల్ ప్రసంగంను అంతర్జాతీయ మీడియా కూడా టెలికాస్ట్ చేసింది. ఇది రెండో హత్యాయత్నం అని పటేల్ చెప్పారు.
నెహ్రూ ప్రయాణిస్తున్న రైలును లక్ష్యంగా చేసుకున్నారు
నెహ్రూ బాంబేకు 1953లో వెళుతున్న సందర్భంగా మూడోసారి హత్యాయత్నం జరిగింది. కళ్యాన్ రైల్వే స్టేషన్ దగ్గర ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా ఓ కానిస్టేబుల్కు కనిపించారు. రైల్వే ట్రాక్ను ఆ ఇద్దరూ ఏదో చేస్తున్నట్లు కనిపించారు. ఇక నెహ్రూ ప్రయాణిస్తున్న అమృత్సర్ ఎక్స్ప్రెస్ 10 నిమిషాల్లో అదే ట్రాక్పై రావాల్సి ఉంది. వారు అనుమానాస్పదంగా కనిపించడంతో కానిస్టేబుల్ వారిపైకి కాల్పులు జరిపారని అప్పటి మీడియా కథనం ప్రచురించింది. ట్రాక్ దగ్గర కానిస్టేబుల్ రెండు బాంబులు స్వాధీనం చేసుకున్నాడని కథనం రాసుకొచ్చింది. అయితే విచారణ చేయగా నెహ్రూను చంపాలన్న ఉద్దేశంతో దుండగులు ట్రెయిన్ను టార్గెట్ చేసుకున్నారన్న విషయం బయటపడింది. ఈ ఘటనను అంతర్జాతీయ మీడియా కూడా క్యారీ చేసింది. అయితే పోలీసులు స్వాధీనం చేసుకున్న బాంబులు పెద్ద శక్తివంతమైన బాంబులు కాదని పేర్కొంది. కానీ పోలీసులు మాత్రం ఇది నెహ్రూపై జరిగిన కుట్రే అని తేల్చేసినట్లు దేశీయ మీడియా తన కథనంలో వెల్లడించింది.
Recommended Video
నాగ్పూర్ పర్యటనలో రిక్షావాలా కత్తితో దాడికి యత్నం
ఇక నాలుగో సారి నెహ్రూపై హత్యాయత్నం 1955లో జరిగింది. నెహ్రూ ఆ సమయంలో నాగ్పూర్ పర్యటనకు వచ్చారు. ఈ ఘటన గురించి నెహ్రూ సెక్రటరీ మథాయ్ తన పుస్తకం మై డేస్ విత్ నెహ్రూలో రాసుకొచ్చారు. ఆ హత్యాయత్నం చేసింది ఓ రిక్షావాలా అని మథాయ్ పుస్తకంలో రాశారు. రిక్షావాలా రాజకీయాలను చాలా దగ్గరగా ఫాలో అవుతున్నట్లు తనకు అనిపించిదని మథాయ్ పుస్తకంలో తెలిపారు. కాంగ్రెస్ పాలనతో అసహనానికి గురై విసిగి వేశారి పోయి కాంగ్రెస్ వృక్షం యొక్క మూలాలు నెహ్రూ అని తలచి కత్తితో హత్య చేయాలని భావించినట్లు మథాయ్ చెప్పారు. అయితే దాడి చేయాలని ముందుకు రాగానే నెహ్రూ భద్రతా సిబ్బంది ఆయన్ను అడ్డుకున్నారు. ఇక విషయం పెద్దదిగా మారడంతో నెహ్రూనే స్వయంగా నేషనల్ హెరాల్డ్ ద్వారా వివరణ ఇచ్చారు. ఇక ఈ విషయం పెద్దదిగా చేయొద్దని అక్కడితో ఫుల్స్టాప్ పెట్టాలని కోరినట్లు నేషనల్ హెరాల్డ్ పత్రిక రాసుకొచ్చింది.