మార్క్ షీట్ కాదు: తల్లిదండ్రులకు ప్రెస్టిజ్.. విద్యార్థులకు ప్రెజర్గా మారింది: ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ విద్యార్థుల పరీక్షలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం విద్యార్థుల మార్క్ షీట్ అనేది వారి కుటుంబాలకు ప్రెస్టిజ్ షీట్గా మారిందని, ఇక విద్యార్థులకు ప్రెజర్ షీట్గా మారిందని ప్రధాని వ్యాఖ్యానించారు. విద్యార్థులు పరీక్షలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలని సూచించారు.

మార్కుల వెంట పరుగెత్తడం కాదు..
నూతన జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ)పై ఎన్సీఈఆర్టీ నిర్వహించిన సెమినార్లో ప్రధాని మోడీ ప్రసంగించారు. భారతదేశంలో విద్య విధానం మార్కుల వెంట పరుగెత్తేది కాదని, నేర్చుకునేందుకు ఉద్దేశించినదని అన్నారు. ఈ లోపాన్ని అధిగమించేందుకే నూతన విద్యా విధానం దోహదపడుతుందన్నారు. ఆత్మవిశ్వాసం పెంచేదిగా ఉంటుందన్నారు.

తల్లిదండ్రులకు ప్రెస్టిజ్ షీట్.. విద్యార్థులకు ప్రెజర్ షీట్..
ఈ రోజుల్లో తమ పిల్లలు పాఠశాలల్లో ఏం నేర్చుకుంటున్నారని వారి తల్లీదండ్రులు అడగడం లేదు. దానికి బదులు పిల్లల మార్కుల గురించి ఆరా తీస్తున్నారు. మార్కుల షీటు అనేది తల్లిదండ్రులకు ప్రెస్టిజ్(ప్రతిష్ట) షీట్గా మారిందని.. ఇక పిల్లలకు అది ప్రెజర్(ఒత్తిడి) షీటుగా మారింది. విద్యార్థులను సరైన మార్గంలో నడిపించాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులపై ఉందని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు.

మాతృభాషే కీలకం.. అనుభవపూర్వక విద్య కావాలి
విద్యార్థులకు కనీసం 5వ తరగతి వరకైనా తమ మాతృభాషలో విద్యాభోధన జరగాలని ప్రధాని అన్నారు. తమ మాతృభాషపై ఆధారపడిన దేశాలే ఎక్కువ అభివృద్ధి సాధిస్తున్నాయని చెప్పారు. ప్రొగ్రాం ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ అసాసిమెంట్లో జపాన్, ఎస్టోనియా, ఫిన్లాండ్ లాంటి దేశాలు మంచి ర్యాంకింగ్ సాధించాయని వివరించారు. ఇతర భాషలను నేర్చుకోవడంలో మాతృభాష ఎంతో సహాయకారిగా ఉంటుందని చెప్పారు. అయితే, నూతన విద్యా విధానం ఇంగ్లీష్ తోపాటు ఇతర భాషలను నేర్చుకునేందుకు అడ్డుపడటం లేదని చెప్పారు. అనుభవపూర్వక అభ్యాసం ఎంతో మేలు చేస్తుందని ప్రధాని చెప్పారు. విద్యార్థులు వారి ఆసక్తులకు అనుగుణంగా ప్రాజెక్టులలో పాల్గొనాలని, ఇది వారు కోరుకున్న మార్గంలో ఉన్నత స్థానాలకు చేరుకునేందుకు ఉపయోగపడుతుందని అన్నారు.












Click it and Unblock the Notifications