మెగాయుద్ధమే: మాజీ సీఎం కుమార్తె వర్సెస్ అఖిలేష్ మరదలు..
అపర్ణా యాదవ్ పోటికి అఖిలేష్ ఓకె చెబితే.. అపర్ణా యాదవ్-రీటా బహుగుణల మధ్య మెగా యుద్దం తప్పదని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
లక్నో: ఉత్తరప్రదేశ్ ఎన్నికలు మునుపెన్నడూ లేని రసవత్తర రాజకీయ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. ఎస్పీ ముసలంతో హీటెక్కిన యూపీ రాజకీయాల్లో సీఎం అఖిలేష్ యాదవ్ మరదలు (తమ్ముని భార్య) అపర్ణా యాదవ్ పోటీ పైనే ప్రస్తుతం అందరి దృష్టి నిలిచింది.
నిజానికి ఎస్పీ వారసురాలిగా అపర్ణా యాదవ్ పొలిటికల్ ఎంట్రీని సెట్ చేయడానికి అధినేత ములాయం సింగ్ తాపత్రయపడినా.. కొడుకు అఖిలేష్ ముందు ఆయన ఎత్తులన్ని చిత్తయిపోయాయి. చివరాఖరికి ముందుగా నిర్ణయించినట్టే.. లక్నో కంటెన్మెంట్ నుంచి అపర్ణా యాదవ్ పోటీకి సిద్దమైపోయింది.
కాగా, లక్నో కంటెన్మెంట్ పై ఎస్పీకి అంతగా పట్టులేకపోవడం అపర్ణా యాదవ్ గెలుపుపై ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఇంతవరకు ఈ స్థానం నుంచి ఎస్పీ గెలిచింది లేదు. ఏడాది క్రితమే లక్నో కంటోన్మెంట్ స్థానాన్ని అపర్ణా యాదవ్ కు కేటాయించడంతో అఖిలేష్ సైతం తన అభ్యర్థుల జాబితాలో ఈ స్థానాన్ని ఖాళీగానే వదిలేశారు.
ఇక ఇదే స్థానం నుంచి బీజేపీ తరపున మాజీ సీఎం హెచ్ ఎన్ బహుగుణా జోషి కుమార్తె రీటా బహుగుణ బరిలో దిగుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి షాకిస్తూ రీటా బహుగుణా జోషి ఇటీవలే బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ కు కంచుకోట లాంటి లక్నో కంటోన్మెంట్ లో గత ఎన్నికల్లో రీటా బహుగుణ 20వేల మెజారిటీతో గెలిచారు.
కాంగ్రెస్ సమాజ్ వాదీ మిత్రపక్షాలుగా ఈ ఎన్నికల్లో బరిలో దిగుతున్న నేపథ్యంలో.. కాంగ్రెస్ ఓటు బ్యాంకు పైనే ఇక్కడి గెలుపోటములు ఆధారపడి ఉన్నాయి. అపర్ణా యాదవ్ పోటికి అఖిలేష్ ఓకె చెబితే.. యాదవ్ రీటాల మధ్య మెగా యుద్దం తప్పదని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.