మ్యావ్ మ్యావ్ కేసు: పోలీస్ స్టేషన్ లాకర్ లో డ్రగ్స్
ముంబై: డ్రగ్స్ మాఫియా లేడి డాన్ మ్యావ్ మ్యావ్ బేబి అలియాస్ శశికళతో పోలీసు అధికారులకు నేరుగా సంబంధాలు ఉన్నాయని వెలుగు చూసింది. ఇప్పటికే పలువురు పోలీసు అధికారులు, కానిస్టేబల్ లను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.
మిగిలిన పోలీసు అధికారుల గురించి కూపీలాగుతున్నారు. డ్రగ్ మాఫియా లేడిడాన్ బేబిని అరెస్టు చేసిన ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు పలు కోణాలలో దర్యాప్తు చేశారు. కానిస్టేబుల్ ధర్మారాజ్ కలోఖే ని గత మార్చి 9న అరెస్టు చేసి విచారణ చేశారు.
ధర్మారాజ్ పోలీస్ స్టేషన్ లోని తన వ్యక్తి గత లాకర్ లో 12 కేజీలు, ఇంటిలో 144 కేజీల మిథైన్ ఎఫిడ్రోన్ (డ్రగ్స్) దాచి పెట్టాడని గుర్తించిన క్రైం బ్రాంచ్ పోలీసులు వాటిని స్వాదీనం చేసుకున్నారు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు శుక్రవారం పలువురు పోలీసులను అరెస్టు చేశారు.
ఇన్స్ పెక్టర్లు గౌతం గైక్వాడ్, సుహాన్ గోఖలే, ఎస్ఐ శంకర్ సారంగ్, ఏఎస్ఐ జ్యోతిరాం మానే, కానిస్టేబుల్ యశ్వంత్ పరాటేలను అరెస్టు చేశారు. ఈ ఐదుగురికి డ్రగ్స్ మాఫియా డాన్ బేబి తదితరులతో సంబంధాలు ఉన్నాయని విచారణలో వెలుగు చూసింది.
ఈ ఐదుగురు మాదకద్రవ్యాలను అక్రమంగా రవాణా చేస్తున్నారని కేసులు నమోదు చేశామని ముంబై డిప్యూటి కమిషనర్ మహాన్ దహికర్ తెలిపారు. మే 15వ తేదిన తమిళనాడుకు చెందిన పాల్ రాజ్ దోరస్వామిని పోలీసులు అరెస్టు చేసి విచారణ చేశారు.
అతను చెప్పిన సమాచారం మేరకు ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు అదే శాఖలో పని చేస్తున్న పోలీసు అధికారులు, సిబ్బందిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. డ్రగ్స్ మాఫియాతో పోలీసులకు లింకులు ఉన్నాయని వెలుగు చూడటంతో ప్రభుత్వం సీనియస్ అయ్యింది.