లక్షలాది మంది పేదరికంలోకి, ఆహార ధాన్యాలు ఉచితంగా ఇవ్వండి: మోడీకి సోనియా
న్యూఢిల్లీ: కరోనా లాక్డౌన్ నేపథ్యంలో దేశంలో లక్షలాది మంది ప్రజలు పేదరికంలోకి కూరుకుపోయే పరిస్థితి ఏర్పడిందని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు. పేదలకు రేషన్ తోపాటు ఆహార ధాన్యాలు ఉచితంగా అందించాలని ప్రధాని నరేంద్ర మోడీని కోరారు.
ఈ మేరకు ప్రధాని మోడీకి రెండో లేఖ రాశారు సోనియా గాంధీ. నెలకు 5 కిలోల ఆహార ధాన్యాలు ఉచితంగా అందించాలని డిమాండ్ చేశారు. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట ఏప్రిల్ జూన్ 2020 కింద అందించాలని కోరారు. ఏప్రిల్-జూన్ వరకు ఉచిత ఆహార ధాన్యాలను అందించిన కేంద్ర ప్రభుత్వం.. జూలై-సెప్టెంబర్ వరకు కూడా అందించాలని కోరారు.
ఇంతకుముందు కూడా ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాసిన సోనియా గాంధీ.. తాజాగా ఈ మేరకు పేర్కొన్నారు. కరోనా కట్టడి చేయడంలో విఫలమయ్యారంటూ సోనియా దుయ్యబట్టారు.
భారతదేశంలో ఇప్పటి వరకు 4,27,278 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1,75,315 యాక్టివ్ కేసులున్నాయి. 2,38,192 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 13,720 మంది కరోనా బారిన పడి మృతి చెందారు.
ఇక ప్రపంచ వ్యాప్తంగా 90,81,145 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 471,316 మంది కరోనాతో మరణించారు. 48,63,113 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 37,46,716 యాక్టివ్ కేసులున్నాయి.