
యశ్వంత్ సిన్హాకు మజ్లిస్ మద్దతు, కేసీఆర్ బాటలో అసదుద్దీన్ ఓవైసీ
రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాలకు మరో పార్టీ బలం చేకూరింది. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. ఆయనకు ఎంఐఎం పార్టీ మద్దతు పలికింది. రాష్ట్రపతి అభ్యర్థిగా సోమవారం యశ్వంత్ సిన్హా నామినేషన్ వేశారు. మజ్లిస్ పార్టీ ప్రజా ప్రతినిధులు రాష్ట్రపతి ఉన్నికల్లో విపక్షాల ఉమ్మ డి అభ్యర్థిగా పోటీ చేస్తున్న యశ్వంత్ సిన్హాకే ఓటు వేస్తారని ప్రకటనలో అసద్ ప్రకటించారు. ఇప్పటికే యశ్వంత్ సిన్హా తనకు ఫోన్ చేశానని, ఆ సందర్భంగా ఆయనకు మద్దతు ప్రకటించానని పేర్కొన్నారు.

యశ్వంత్ సిన్హాకు మజ్లిస్ సపోర్ట్
విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు తెలంగాణ సీఎం కేసీఆర్ మద్దతు పలికారు. ఈ మేరకు కేంద్ర మాజీ మంత్రి, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ వెల్లడించారు. యశ్వంత్ సిన్హా అభ్యర్థిత్వానికి సంబంధించి కేసీఆర్తో రెండుసార్లు ఫోన్లో మాట్లాడానని ఆయన వివరించారు. యశ్వంత్ సిన్హాకు కేసీఆర్ మద్దతు తెలిపారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు యశ్వంత్ సిన్హాకు అనుకూలంగా ఓటు వేయనున్నారు. ఒక పార్టీ సపోర్ట్ చేయడంతో.. విపక్షాలకు మద్దతు పెరిగినట్టు అయ్యింది. తర్వాత మజ్లిస్ పార్టీ కూడా సపోర్ట్ చేస్తామని తెలిపింది.

టీఆర్ఎస్-ఎంఐఎం
తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీతో మజ్లిస్ అనుకూలంగా ఉంటుంది. ఆ మేరకు రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా ఆ పార్టీ విపక్షాల అభ్యర్థికి మద్దతు తెలిపింది. రాష్ట్రంలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం జరుగుతున్న.. రాష్ట్రపతి ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్.. టీఆర్ఎస్, మజ్లిస్ ఓకే అభ్యర్థికి మద్దతు తెలుపుతున్నాయి.
18న పోలింగ్.. 21న కౌంటింగ్
రాష్ట్రపతి ఎన్నికలకు నోటిఫికేషన్ను ఈ నెల 15న జారీ చేశారు. ఆ రోజు నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రారంభం అయ్యింది. ఈ నెల 29 వరకు నామినేషన్లను స్వీకరిస్తామని, 30న నామినేషన్ల పరిశీలన ఉంటుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. జులై 2 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుందని తెలిపారు. రాష్ట్రపతి ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ను జులై 18న నిర్వహిస్తామని.. జులై 21న ఓట్ల లెక్కిస్తామని తెలిపారు.