వెయిటర్లలా ఉంటారు: మంత్రులపైనే స్వామి సెటైర్!
న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలిచే భారతీయ జనతా పార్టీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి తాజాగా మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు. ఈసారి విదేశీ పర్యటనల్లో ఎన్డీఏ మంత్రులు వేసుకునే దుస్తులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.
ఇటీవలే ఆయన ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్పై వరసగా విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తన రూటు మార్చి ఈసారి కేంద్ర మంత్రుల దుస్తులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
మంత్రులు విదేశీ పర్యటనలో టై, కోట్ ధరించవద్దని భారతీయ సంప్రదాయాన్ని చాటే దుస్తులు మాత్రమే ధరించాలని ఆయన ట్విట్టర్లో ట్వీట్ చేశారు. బీజేపీ ఈ అంశంపై చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. మంత్రులు మన సంప్రదాయ దుస్తుల్లో కాకుండా విదేశీ దుస్తుల్లో కనిపిస్తే వారు వెయిటర్లలా ఉంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు.
గత కొంతకాలంగా ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్, ఆర్ధిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యం తాజాగా ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తి కాంతాదాస్ లను లక్ష్యంగా చేసుకుని సుబ్రమణ్యం స్వామి విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.
BJP should direct our Ministers to wear traditional and modernised Indian clothes while abroad. In coat and tie they look like waiters
— Subramanian Swamy (@Swamy39) June 24, 2016