రాజు గారి గది 602.. ‘మంత్రాలయ’లో మిస్టరీ.. మంత్రులకు హడల్
ఆ భవంతి పేరు మంత్రాలయ.. మహారాష్ట్ర సెక్రటేరియట్. దాని ఆరో అంతస్తులో అతి కీలకమైన 'పవర్ సెంటర్' ఉంది.. అంటే ముఖ్యమంత్రి కార్యాలయమన్నమాట. కానీ దాని ఎదురుగా ఉండే 602 గదంటే మాత్రం అందరికీ హడల్. 'రాజుగారి గది' సిరీస్ ను తలపించేలా 602 ఛాంబర్ పై ఎన్నెన్నో మిస్టరీ కథనాలు ప్రచారంలో ఉన్నాయి. మొన్ననే డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న అజిత్ పవార్ కు అదే గది కేటాయించడంతో 602 మళ్లీ వార్తల్లోనిలిచింది.

వద్దు బాబోయ్..
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కు కేటాయించిన 602.. దాదాపు 3వేల చదరపు అడుగుల విశాలమైన ఛాంబర్. లోపల సౌకర్యవంతమైన కాన్ఫరెన్స్ రూమ్, సోఫిస్టికేటెడ్ క్యాబిన్ తో అత్యధ్బుతంగా ఉంటుంది. కానీ అందులో పనిచేసేందుకు ఆయన అసలే ఇష్టపడటంలేదు. అధికారులతో పోరాడిమరీ అదే ఆరో అంతస్తులో.. చీఫ్ సెక్రటరీ కోసం కేటాయించిన ఓ చిన్న గదిలోకి మారిపోయారు. సెక్రటేరియట్ లోని 602 గదిపై నాయకుల్లో నెలకొన్న మూఢనమ్మకం అంత బలంగా పనిచేస్తోంది మరి.

ఏంటా మిస్టరీ?
రాజకీయ నాయకులు ఎక్కువగా భయపడేది దేని గురించంటే.. పదవి, ప్రాణం గురించేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతంలో మంత్రాలయలోని 602 గదిలో పనిచేసిన మంత్రులందరికీ చాలా చేదు అనుభవవాలు ఎదురయ్యాయి. 2014లో 602ను ఆధునీకరించిన తర్వాత బీజేపీ సీనియర్ లీడర్ ఏక్ నాథ్ ఖడ్సే వ్యవసాయ, రెవెన్యూ, మైనార్టీ వ్యవహారాల మంత్రిగా ఆ గదిలో పనిచేశారు. ఖడ్సే 602లోకి ఎంటరైన కొద్ది నెలలకే భూకబ్జా కేసుల్లో దోషిగా తేలి పదవి కోల్పోవాల్సి వచ్చింది. తర్వాత బీజేపీకే చెందిన పాండురంగ ఫండ్కర్ వ్యవసాయ మంత్రిగా 602లో బాధ్యతలు చేపట్టారు. కొద్దిరోజులకే అనూహ్యరీతిలో ఆయన గుండెపోటుతో మరణించారు. పాండురంగ తర్వాత 602లోకి మంత్రిగా వచ్చిన అనిల్ బోండే.. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడిపోయారు. దీంతో 602 అంటేనే ‘రాజు గారి గది' అనే అభిప్రాయం ఏర్పడింది. అందులోకి వెళితే మన పని ఖతం అని మంత్రులు భావిస్తున్నారు.

మూఢనమ్మకం అంటే ఒప్పుకోరట
ప్రజాధనంతో పనిచేసే సెక్రటేరియట్ లో ఆధునిక హంగులుండే 602 గది.. కేవలం మంత్రుల మూఢనమ్మకాల కారణంగా వృథాగా పడిఉండటంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అయితే మంత్రులు మాత్రం తమది మూఢనమ్మకమని ఒప్పుకునే స్థితిలో లేరు. ఆఖరికి అజిత్ పవార్ కూడా.. 602లో ఎందుకు చేరడంలేదన్న ప్రశ్నకు సమాధానం దాటవేశారు.












Click it and Unblock the Notifications