మోదీ మార్కు మరో మార్పు: కేబినెట్ విస్తరణ వేళ కేంద్రంలో కొత్తగా సహకార శాఖ ఏర్పాటు, ఇదీ లక్ష్యం
కట్టడాల నుంచి కరెన్సీ నోట్ల దాకా, సంస్థల నుంచి శాఖల దాకా ప్రతిదాంట్లోనూ కాంగ్రెస్ మార్కును వదిలించుకుంటూ కొత్త మార్పులు చేయడం ప్రధాని మోదీకి బాగా అలవాటైనపని. దేశంలో పరిపాలన, ప్రణాళికలకు సంబంధించి ఇప్పటికే లెక్కుమించి కొత్త నిర్ణయాలు తీసుకున్న ఆయన తాజాగా కేంద్రంలో సరికొత్త శాఖను ఏర్పాటు చేశారు. సరిగ్గా కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ వేళ ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది..
సహకార మంత్రిత్వ శాఖ పేరుతో కేంద్రం ప్రభుత్వం ఓ సరికొత్త మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది. కేంద్ర స్థాయిలో 'సహకార్ సే సమృద్ధి(సహకారంతోనే అభివృద్ధి)' అనే ఆలోచనను నిజం చేసేందుకు ఈ శాఖ ఉపయోగపడుతుందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. కొత్తదైన సహకార మంత్రిత్వ శాఖకు ఓ ప్రత్యేక పాలనా విభాగం ఉంటుందని, న్యాయమపరమైన, నియమబద్ధమైన ఓ నియమావళి ఉంటుందని, దీని ద్వారా దేశంలోని సహకార ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయవచ్చని కేంద్రం చెబుతోంది.
ప్రధానంగా సహకార సంఘాలు సులభంగా వర్తకాన్ని నిర్వహించుకునేందుకు, దానికి గల అడ్డంకులను తొలగించి వారికి సహకరిస్తుందని సర్కారు చెబుతున్నది. కేంద్రం మాట. అలాగే రాష్ట్ర స్థాయిలో సహకార సంఘాల అభివృద్ధికి తోడ్పడుతుందని, ఏరకంగా చూసినా ఇదో చరిత్రాత్మకమైన ముందడుగని, ఇది దేశ అభివృద్ధికి కీలక మలుపని కేంద్రం పేర్కొంది. బుధవారం నాటి కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో ఈ శాఖకు కూడా మంత్రిని నియమించనున్నారు.
రెండోసారి గెలిచిన తర్వాత రెండున్నరేళ్లకు ప్రధాని మోదీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ చేపట్టారు. బుధవారం సాయంత్రం 6 గంటలకు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే, మంత్రివర్గంలో మార్పులు, చేర్పుల గురించి ఉత్కంఠ కొనసాగుతోంది. పూర్తి జాబితా కొద్ది నిమిషాల ముందు మాత్రమే వెలువడనుంది.