అడవిలోకి తీసుకెళ్లి అమ్మాయిపై గ్యాంగ్ రేప్
ఓ అమ్మాయిపై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. అమ్మాయిని అడవిలోకి తీసుకుని వెళ్లి వారు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు.
భువనేశ్వర్: ఓ వివాహానికి వెళ్లి రాత్రివేళ ఇంటికి తిరిగి వస్తున్న పదమూడేళ్ల బాలికపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారం జరిపారు.ఈ సంఘటన ఒడిశా రాష్ట్రంలోని కియోంజర్ జిల్లాలో చోటు చేసుకుంది. కియోంజర్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన 13 ఏళ్ల బాలిక పెళ్లికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.
దాలంగాపాణి గ్రామ శివార్లలో ఆమెను ముగ్గురు యువకులు పట్టుకొని అడవిలోకి లాక్కెళ్లి సామూహికంగా అత్యాచారం చేశారు. నిందితులు 19నుంచి 25 ఏళ్ల వయసు వారేనని పోలీసులు చెప్పారు. బాధిత బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేర కేసు నమోదు చేసి బాలికను వైద్య పరీక్ష కోసం ఆసుపత్రికి పంపించామని ఎస్ఐ నారాయణ బహేరా చెప్పారు.
నిందితులైన ముగ్గురు యువకులను అరెస్టు చేశామని ఎస్ఐ వివరించారు. నిందితులను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి పంపించినట్లు తెలిపారు. కేసును దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.