మరో ఘోరం: మదర్సాలో బంధించి బాలికపై అత్యాచారం, చాపలో చుట్టేశారు
ఢిల్లీ: ఉన్నావో, కథువా ఘటనలకు మరువక ముందే ఉత్తరప్రదేశ్లో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఢిల్లీకి సమీపంలోని ఘజియాబాద్లో పదేళ్ల బాలికను మదర్సాలోకి తీసుకెళ్లి, అక్కడే బంధించి అత్యాచారం జరిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఓ నిందితుడ్ని అరెస్ట్ చేశారు.
ఆచూకీ లభించకపోవడంతో..
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఏప్రిల్ 21వ తేదీన సదరు బాధిత బాలిక ఏదో కొనడానికి మార్కెట్కు వెళ్లింది. ఆ తర్వాత ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో ఆమె తండ్రి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
బాలికను చాపలో చుట్టుశారు
బాలిక వద్ద ఉన్న ఫోన్కు ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ చేసి ఉంది. అయితే ఫోన్ ఏ లొకేషన్లో ఉందో పసిగట్టిన పోలీసులు... ఏప్రిల్ 22వ తేదీన మదర్సాపై మెరుపు దాడి చేశారు. అక్కడ బాలికను ఓ చాపలో చుట్టి ఉంచడం గమనించారు. పోలీసులు దాడి చేసిన సమయంలో ఒక టీనేజ్ యువకుడితో పాటు, మౌల్వి, మరో ఇద్దరు అక్కడే ఉన్నారు.
మదర్సాలోకి లాక్కెళ్లి..
టీనేజరే తనను మదర్సాలోకి లాక్కెళ్లాడని మేజిస్ట్రేట్ ముందు బాధిత బాలిక తెలిపింది. తన స్నేహితురాలిని కలుసుకునేందుకు తాను వెళ్లగా... ఆమె అన్న తన వద్దకు వచ్చి తన సోదరి వద్దకు తీసుకెళతానని చెప్పి, మదర్సాలోకి లాక్కెళ్లాడని తెలిపింది. ఆ తర్వాత తనపై అత్యాచారం చేశాడని తెలిపింది.
నిందితుడి అరెస్ట్, మౌల్వీ కూడా..
టీనేజర్ తో పాటు మౌల్వి కూడా తనపై అత్యాచారం చేశాడని బాధిత బాలిక తనతో చెప్పిందని ఆమె మేనమామ ఆరోపించారు. ఈ కేసులో కీలక నిందితుడైన 17 ఏళ్ల టీనేజర్ను అరెస్ట్ చేసి, జువైనల్ హోమ్కు తరలించారు. అయితే, ఈ ఘోరంలో భాగస్వామి అయిన మౌల్వీని కూడా అరెస్ట్ చేయాలంటూ బాధితురాలి కుటుంబసభ్యులు, బంధువులు, పలు హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఘటనపై సీబీఐ విచారణ చేపట్టాలని కోరారు. కాగా, బాధితురాలి కుటుంబానికి అండగా ఉంటామని యూపీ ప్రభుత్వం తెలిపింది.