వెనక్కి తగ్గిన తండ్రి: అఖిలేష్ యాదవ్పై సస్పెన్షన్ ఉపసంహరణ
లక్నో: సమాజ్వాదీ పార్టీలో నెలకొన్న ముసలం ఎట్టకేలకు ముగిసింది. ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్, ఆయన కుమారుడు, సీఎం అఖిలేష్ యాదవ్ల మధ్య శనివారం రాజీ కుదిరింది. దీంతో అఖిలేష్పై ఆరేళ్లపాటు పార్టీ విధించిన సస్పెన్షన్ను ఉపసంహరించుకున్నట్లు ములాయం ప్రకటించారు. రాంగోపాల్ పై విధించిన సస్పెన్షన్ కూడా ఎత్తివేశారు. ములాయం, అఖిలేష్ మధ్య రాజీ కుదర్చడంలో సీనియర్ నేత అజాంఖాన్ కీలక పాత్ర పోషించారు.
ములాయంతో మంతనాలు
తనకు మద్దతు ఇస్తున్న శాసనసభ్యుల జాబితాతో అఖిలేష్ యాదవ్ ములాయం సింగ్ నివాాసానికి చేరుకున్నారు. వారిద్దరి భేటీలో ఆజం ఖాన్ కూడా పాల్గొన్నారు. కాసేపటి తర్వాత ఎస్పీ సీనియర్ నేత శివపాల్ యాదవ్ కూడా ములాయం ఇంటికి చేరుకున్నారు.
ఎన్నికల్లో గెలుపే తండ్రికి కానుక: అఖిలేష్ కంటతడి
యూపీ ఎన్నికల్లో గెలుపే తన తండ్రికి తాను ఇచ్చే కానుక అని అఖిలేష్ యాదవ్ సమావేశంలో కంటతడి పెడుతూ భావోద్వేగానికి గురయ్యారు. తాను తన తండ్రి నుంచి విడిపోలేదని ఆయన స్పష్టం చేశారు.
సమావేశం నుంచి బయల్దేరిన అఖిలేష్
ఓ అఖిలేష్, మరోవైపు ములాయం సింగ్ యాదవ్లు తమకు అనుకూలమైన ఎమ్మెల్యేలు, నేతలతో సమావేశాలు నిర్వహించారు. అనంతరం అఖిలేష్ యాదవ్.. తన తండ్రి, ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ఇంటికి బయల్దేరారు. పార్టీలో విభేదాలను చల్లార్చేందుకు ఆయన ములాయం ఇంటికి వచ్చారని పలువురు పేర్కొంటున్నారు.
అఖిలేష్ ముందు రెండే దారులు
ఉత్తరప్రదేశ్ రాజకీయాలు కీలక దశకు చేరుకున్నాయి. సమాజ్వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ఆరేళ్లపాటు పార్టీ నుంచి బహిష్కరించిన నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేష్ యాదవ్ శనివారం ఉదయం పార్టీ ఎమ్మెల్యేలతో కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
అయితే, అఖిలేష్ యాదవ్ ముందు రెండే దారులున్నాయి. ఒకటి అఖిలేష్ యాదవ్ తన ప్రభుత్వాన్ని రద్దు చేసుకోవడం లేదా గవర్నర్ కోరితే మెజార్టీని నిరూపించుకోవాల్సన పరిస్థితి. ఈ రెండింటిలో ఏ నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఇప్పుడు ప్రధాన చర్చ జరుగుతోంది.
ప్రస్తుతం అఖిలేష్ యాదవ్ నిర్వహిస్తున్న సమావేశానికి వచ్చే ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి ఆయన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాగా, అఖిలేష్ కు మద్దతు తెలుపుతూ ప్రస్తుతం 229మంది ఎమ్మెల్యేలు సమావేశానికి హాజరయ్యారు. అఖిలేష్ కోసం దేనికైనా సిద్ధమని వారు ప్రకటిస్తున్నారు. అంతేగాక, ఇతర పార్టీలకు చెందిన 17మంది ఎమ్మెల్యేలు కూడా అఖిలేష్ మద్దతుగా నిలుస్తున్నట్లు తెలిసింది. కాగా, ములాయం వర్గం కూడా ఏమాత్రం తగ్గడం లేదు.
అఖిలేష్ సమావేశం
సమావేశానికి సీఎం అఖిలేష్ యాదవ్ శనివారం ఉదయం 10గంటలకు చేరుకున్నారు. అనుకూల ఎమ్మెల్యేలతో ఆయన సమావేశం నిర్వహించారు. తమ తమ నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా ప్రచారం నిర్వహించాలని సూచించారు.
అంతకుముందు జరిగిన పరిణామాలు ఇలా ఉన్నాయి..
- లక్నోలోని అఖిలేష్ ఇంటికి ఎస్పీ సీనియర్ నేత అజాంఖాన్ చేరుకున్నారు.
-కమ్యూనల్ ఫోర్సెసెస్ను ఎదుర్కొనేందుకు ఎస్పీ నేతలందరూ కలిసే ఉండాలని ములాయం సింగ్ యాదవ్కు లాలూ ప్రసాద్ యాదవ్ సూచించారు.
- ములాయం సింగ్ యాదవ్ ఏర్పాటు చేసిన మీటింగ్లో హాజరయ్యేందుకు సీనియర్ ఎస్పీ లీడర్ బేణి ప్రసాద్ పార్టీ ఆఫీసుకు వచ్చారు.
-అంతకుముందు అజాంఖాన్ కూడా ములాయం సింగ్ యాదవ్ ను కలిశారు.
- ముఖ్యమంత్రిగా అఖిలేష్ యాదవ్ ఉండాలని, అయితే, తమ నాయకుడు మాత్రం ములాయం సింగేనని ఎస్పీ నేత అటిక్ అహ్మద్ స్పష్టం చేశారు.
- ఉదయం 11.10నిమిషాలకు ములాయం సింగ్ పార్టీ ఆఫీసుకు చేరుకున్నారు. పార్టీ నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు.
- శనివారం సాయంత్రం 3గంటలకు ముస్లిం పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేశారు.
- సమాజ్వాదీ పార్టీలో ముసలం ఆ పార్టీకి సంబంధించిన విషయమని బిజెపి నేత కల్రాజ్ మిశ్రా అన్నారు.