మోడీ, ఆయన స్నేహితులు భారతదేశ ఉపాధి వెన్నెముక విరగ్గొట్టారు: యూపీలో రాహుల్ గాంధీ ధ్వజం
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారతదేశంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించలేదని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆయన స్నేహితులు భారతదేశ ఉపాధి వెన్నెముకను విరగ్గొట్టారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఎన్నికల ర్యాలీలో వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఆరోపణలు చేశారు.
మోడీ యూపీలో ఉపాధి గురించి మాట్లాడరేం
రాబోయే కాలంలో ఈ దేశంలోని యువతకు ఉపాధి దొరకదని ఆందోళన వ్యక్తం చేశారు. కోవిడ్ సమయంలో తన మాట ఎవరూ వినలేదని, ఫలితంగా గంగలో మృతదేహాలను చూశారని పేర్కొన్నారు. బిజెపి నాయకులకు గుణపాఠం నేర్పాల్సిన అవసరం ఉందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించకపోవడంపై ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తూ.. ఎన్నికల ప్రసంగాల్లో ప్రధాని మోడీ ఉపాధి గురించి ఎందుకు మాట్లాడరు అంటూ ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్కు వచ్చినప్పుడు ఉద్యోగాల గురించి ఎందుకు చెప్పరు? అని నిలదీశారు.
ఉద్యోగాలు ఎంత మందికి ఇచ్చారు .. లెక్కలు చెప్పండి
రాష్ట్ర యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామనీ, 2014లో ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, ఎంత మందికి ఉపాధి కల్పించామని, రానున్న కాలంలో మరెంత మందికి ఉపాధి కల్పిస్తామని ఎందుకు చెప్పడం లేదు అని రాహుల్ గాంధీ ప్రధాని మోడీ ని టార్గెట్ చేశారు. ప్రధాని మోడీ అన్ని అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. అధికారంలో ఉన్న 70 ఏళ్ళలో కాంగ్రెస్ హయాంలో ఏమీ జరగలేదని బిజెపి నాయకులు చేస్తున్న ఆరోపణలకు ఎదురుదాడి చేసిన రాహుల్ గాంధీ అవును వాస్తవానికి 70 ఏళ్ళలో అంబానీలకు, అదానీ లకు ఏమీ జరగలేదని ప్రజలు గుర్తించాలన్నారు.
కాంగ్రెస్ హయాంలో బిలియనీర్లకు ఉపాధి ఇవ్వలేదు
భారతదేశంలోని అతిపెద్ద బిలియనీర్లకు తాము ఉపాధి ఇవ్వలేదని, తాము సామాన్య ప్రజలకు ఉపాధి కల్పించామని రాహుల్ గాంధీ వెల్లడించారు. కార్పోరేట్ సంస్థలకు దోచిపెట్టే సంస్కృతి బీజేపీకే ఉందని ఆయన పేర్కొన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని ప్రధాని హామీ ఇచ్చారని, కానీ నల్ల చట్టాలను అమలు చేశారని మండిపడ్డారు. రద్దు చేయబడిన వ్యవసాయ చట్టాల లక్ష్యం రైతులు పొందుతున్న వాటిని లాక్కొని బిలియనీర్ల కు కట్టబెట్టడం అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.
Recommended Video
రేపే ఐదో విడత పోలింగ్, 60 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎన్నికల ఏర్పాట్లు
ఇదిలా ఉంటే ఏడు దశల ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో నాలుగు దశల్లో పోలింగ్ ముగిసింది. ఫిబ్రవరి 27న ఉత్తరప్రదేశ్లో ఐదవ దశ పోలింగ్ జరగనుండగా, 60 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. ఈ దశలో అమేథీ, అయోధ్య, బహ్రైచ్, బారాబంకి, చిత్రకూట్, గోండా, కౌశాంబి, ప్రతాప్గఢ్, ప్రయాగ్రాజ్, శ్రావస్తి మరియు సహా 11 జిల్లాల్లోని 60 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ స్థానాలతో పాటు సుల్తాన్పూర్లో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.