కాశీ నుండే ప్రక్షాళన: కలవాలని విపక్షాలకి మోడీ చురక
లక్నో: కాబోయే భారత ప్రధాని నరేంద్ర మోడీ శనివారం విపక్షాలకు చురకలు అంటించారు. ఆయన వారణాసిలో మాట్లాడుతూ... విపక్షాలు అన్నీ కలిసి కూటమిగా ఏర్పడవచ్చునని, వారు ప్రతిపక్ష హోదా దక్కించుకోవడానికిి మాత్రమే జట్టు కట్టాల్సి ఉంటుందని ఎద్దేవా చేశారు. వచ్చే ఐదేళ్లలో దేశాన్ని ప్రక్షాళన చేస్తానని మోడీ ప్రకటించారు. శుద్ధి కార్యక్రమాన్ని పవిత్ర కాశీ నుంచే మొదలు పెడతానని చెప్పారు.
గాంధీ మహాత్ముడి కలలను సాకారం చేసే దిశగా కృషి చేస్తానన్నారు. ఇప్పటి నుంచి ఐదేళ్లపాటు మహాత్ముడి 150 వ జయంతి ఉత్సవాలను నిర్వహిస్తామన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన మోడీ శనివారం వారణాసి వచ్చారు. విమానాశ్రయం నుంచి కాశీ విశ్వేశ్వరుని ఆలయం వరకు ఆయన ర్యాలీగా తరలి వెళ్లారు.

కాశీనాథుడిని పూజించుకొని అనంతరం గంగానది ఒడ్డుకు చేరుకొని, అక్కడ గంగాహారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. భారీగా విచ్చేసిన అభిమానులనుద్దేశించి ఆయన ప్రసంగించారు. ఏదో ఐదేళ్ల కాంట్రాక్టు కోసం వారణాసి రాలేదన్నారు. కలిసి పని చేసి కాశీని బాగు చేసుకుందామన్నారు.
పవిత్ర గంగానదిని శుభ్రపరచడమే తన లక్ష్యమన్నారు. పరిశుభ్రమైన గంగానది, పరిశుభ్రమైన కాశీ, పరిశుభ్రమైన భారత్ సాధించడమే మన లక్ష్యమన్నారు. ఇదే గాంధీకి మనమిచ్చే నివాళి అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మోడీతోపాటు పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్, మోడీ సన్నిహితుడు అమిత్ షాతోపాటు పలువురు నేతలు పాల్గొన్నారు.
మూడో కూటమిని ఏర్పాటు చేస్తామని, మోడీ ప్రధాని కాకుండా అడ్డుకుంటామంటూ ఎన్నికల ముందు హడావుడి చేసిన నేతలకు మోడీ సూచనల చేశారు. ఇప్పుడు కూడా ఆ పార్టీలన్నీ కలిసి కూటమిగా ఏర్పడవచ్చని అయితే వారు ప్రతిపక్ష హోదా దక్కించుకోవడానికి మాత్రమే కలవల్సి ఉంటుందన్నారు. ప్రతిపక్ష హోదా పొందాలంటే మొత్తం లోకసభ సీట్లలో 10 వ వంతు సీట్లను (54) గెలవాల్సి ఉంటుంది. కాంగ్రెస్ 44 సీట్లు మాత్రమే సాధించింది. దీంతో ఆ పార్టీ ప్రతిపక్ష హోదా కూడా సాధించడకుండా దారుణ పరాభవాన్ని చవి చూసింది.












Click it and Unblock the Notifications