రోడ్లు ఊడ్చిన ఒమర్ అబ్దుల్లా, నరేంద్ర మోడీ కితాబు
న్యూఢిల్లీ/శ్రీనగర్: ప్రధాని నరేంద్ర మోడీ జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పైన ప్రశంసలు కురిపించారు. మోడీ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఒమర్ పాలు పంచుకున్నారు. శ్రీనగర్లో అతను చీపురు పట్టాడు. వీధులను శుభ్రం చేశాడు. ఒమర్ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొనడంపై మోడీ ట్వీట్ చేశారు.
ఇది చాలా అద్భుతమైనదని వ్యాఖ్యానించారు. స్వచ్ఛ భారత్లో ఒమర్ పాలుపంచుకోవడం జమ్ము కాశ్మీర్ ప్రజలకు స్ఫూర్తిగా నిలిచారని, ఇది కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకు వెళ్లేందుకు ఉపకరిస్తుందని అభిప్రాయపడ్డారు.
ఒమక్ అబ్దుల్లా బుధవారం రాత్రి స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీనగర్ మున్సిపల్ కార్పోరేషన్ అధికారులతో కలిసి ఆయన వరదల ప్రభావిత ప్రాంతాలలో నగరాన్ని శుభ్రం చేశారు. నగరంలోని వీర్ నగర్లో వీరు శుభ్రం చేశారు. వరద కారణంగా ఈ ప్రాంతం బాగా దెబ్బతింది. కాగా, తనను నామినేట్ చేసినందుకు బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్కు ఒమర్ అబ్దుల్లా ధన్యవాదాలు తెలిపారు.

ఇదిలా ఉండగా, దీపావళి పర్వదినం నాడు నరేంద్ర మోడీ జమ్ము కాశ్మీర్లో పర్యటించిన విషయం తెలిసిందే. మోడీ దీపావళి రోజు తొలుత సియాచిన్ వచ్చారు. మధ్యాహ్నం వరకు అక్కడ సైనికులతో గడిపారు. గత పదేళ్లలో సియాచిన్ ప్రాంతాన్ని సందర్శించిన తొలి ప్రధాని మోడీనే. ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్ సుహాగ్ కూడా మోడీతో పాటు ఈ పర్యటనలో పాల్గొన్నారు.
ఉదయం నుండి ప్రధాని తన పర్యటన విషయాలు పలుమార్లు ట్వీట్ చేశారు. సియాచిన్ హిమనీనదానికి వెళ్తున్నానని, ఎంతో ముఖ్యమైన దీపావళి రోజున సైనికులతో గడపడం తన అదృష్టమని ప్రధాని పేర్కొన్నారు. దేశంలోని 125 కోట్ల మంది ప్రజలు భద్రంగా ఉన్నారంటే జవాన్ల మొక్కవోని దైర్యమన్నారు.
సైనికులను ప్రధాని ఆప్యాయంగా పలకరించి కరచాలనం చేశారు. వారికి మిఠాయిలు పంచారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, ప్రధాని మోడీలు పరస్పరం ప్రశంసలు కురిపించారు. వరదల సమయంలో బాగా స్పందించారని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications