రాబోయే ఐదేళ్లలో వాటిని పూర్తిగా తుడిచిపెట్టేస్తాం.. : అమిత్ షా
రాబోయే ఐదేళ్లలో దేశంలో ఉగ్రవాదాన్ని,వామపక్ష తీవ్ర వాదాన్ని, ఈశాన్య రాష్ట్రాల్లోని తిరుగుబాట్లను పూర్తిగా అణచివేస్తామన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. అలాగే మనుషుల అక్రమ రవాణా,ఆయుధాల అక్రమ రవాణా, సరిహద్దు చొరబాట్లు,దొంగ కరెన్సీ నోట్లు,హవాలా లావాదేవీలు,డ్రగ్స్ విక్రయాలు,సైబర్ దాడులకు పూర్తిగా అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఢిల్లీలో జరిగిన 32వ ఇంటలిజెన్స్ బ్యూరో సెంటినరీ ఎండోమెంట్ కార్యక్రమంలో అమిత్ షా మాట్లాడారు.
దేశ భద్రత కోసం ఆయా భద్రతా విభాగాలతో ఇంటలిజెన్స్ విభాగాల అనుసంధానం జరగాల్సిన అవసరం ఉందని అమిత్ షా పేర్కొన్నారు. గత ఐదేళ్లలో అనేక ఉగ్ర కుట్రలను భగ్నం చేయడంలో ఇంటలిజెన్స్ కీలక పాత్ర పోషించిందన్నారు.
దేశానికి ఐబీ అందిస్తోన్న సేవలు భారత చరిత్ర పుటల్లో నిలిచిపోతాయన్నారు. భవిష్యత్లో దేశ సంపద 5 ట్రిలియన్ డాలర్లకు చేరాలంటే దేశ భద్రతకు సంబంధించిన సవాళ్లన్నింటినీ అధిగమించాల్సిన అవసరం ఉందన్నారు.