సీబీఐ ప్రత్యేక డైరెక్టర్గా రాకేశ్ ఆస్థానా నియామకం.. అంతలోనే అవాంతరం!
కేంద్ర ప్రభుత్వం ఆదివారం ఐపీఎస్ అధికారి రాకేశ్ ఆస్థానాను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) ప్రత్యేక డైరెక్టర్గా నియమించింది. అయితే రాకేశ్ ఆస్థానా నియామకం అక్రమమని, దీనిపై తాను కోర్టుల
న్యూఢిల్లీ: నిఘా, భద్రత, దర్యాప్తు విభాగాల్లో అధికారులకు పదోన్నతులు కల్పించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఆదివారం కీలక మార్పులు చేసింది. ఐపీఎస్ అధికారి రాకేశ్ ఆస్థానాను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) ప్రత్యేక డైరెక్టర్గా నియమించింది.
అలాగే గుర్బాచన్ సింగ్ను ఇంటెలిజెన్స్ బ్యూరో ప్రత్యేక డైరెక్టర్గా, సుదీప్ లఖ్తాకియాను సీఆర్పీఎఫ్ ప్రత్యేక డైరెక్టర్ జనరల్గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. రాజేశ్ రంజన్, ఏపీ మహేశ్వరిలకు బీఎస్ఎఫ్లో ప్రత్యేక డైరెక్టర్ జనరళ్లుగా పదోన్నతి కల్పించింది.
''రాకేశ్ నియామకం చెల్లదు.. కోర్టుకెళతా..''
అయితే.. సీబీఐ ప్రత్యేక డైరెక్టర్గా రాకేశ్ ఆస్థానా నియామకం అక్రమమని, దీనిపై తాను కోర్టులో పిటిషన్ వేస్తానని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ పేర్కొన్నారు. రాకేశ్ ఆస్థానాపై స్టెర్లింగ్ బయోటెక్ డైరీలో పేరు ఉందని, సీబీఐయే రాకేశ్ పేరును ఎఫ్ఐఆర్లో పేర్కొందని ఆయన చెప్పారు.
ఎఫ్ఐఆర్లో పేరు ఉన్న వ్యక్తిని సీబీఐకు స్పెషల్ డైరెక్టర్గా ఎలా చేస్తారని ప్రశాంత్ భూషణ్ ప్రశ్నించారు. చూస్తుంటే దేశంలోని అత్యున్నత విచారణ సంస్థ స్వతంత్రతను నాశనం చేయడానికి ప్రభుత్వం కంకణం కట్టుకుందని అనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.