సర్వే: అత్యంత విశ్వసనీయవ్యక్తి నరేంద్ర మోడీ: నమ్మదగింది ప్రధాని కార్యాలయం
న్యూఢిల్లీ: దేశంలో అత్యంత విశ్వసించదగిన వ్యక్తి నరేంద్ర మోడీ అని ఫస్ట్ పోస్ట్ - ఐపీఎస్ఓఎస్ నేషనల్ ట్రస్ట్ సర్వేలో వెల్లడైంది. ఆ తర్వాత చాలా దూరంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ ఉన్నారు. అత్యంత విశ్వసించదగిన వ్యక్తిగా మోడీకి 53 శాత మంది ఓటు వేయగా, కాంగ్రెస్ అధ్యక్షుడికి కేవలం 26.9 ఓట్లు మాత్రమే వచ్చాయి.
ఉత్తరాదిన నరేంద్ర మోడీ ప్రభావం ఉంది. కానీ దక్షిణాది విషయానికి వచ్చేసరికి మోడీ కంటే రాహుల్ గాంధీకి ఎక్కువ ఓట్లు వచ్చాయి. దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో రాహుల్ గాంధీని విశ్వసిస్తున్నట్లు తెలిపారు. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ ఎక్కువగా లేని విషయం తెలిసిందే.
మోడీ తర్వాత రాహుల్ గాంధీ
ఫస్ట్ పోస్ట్ - ఐపీఎస్ఓఎస్ నేషనల్ ట్రస్ట్ సర్వేలో 34,470 మంది పాల్గొన్నారు. ఇందులో 291 అర్బన్ వార్డులు, 690 గ్రామస్తులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ తర్వాత చాలా దూరంలో రాహుల్ గాంధీ రెండో స్థానంలో ఉండగా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి నాలుగు శాతం ఓట్లు, బహుజన సమాజ్ వాది పార్టీ అధినేత్రి, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతికి కేవలం రెండు శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి.
దక్షిణాదిన ప్రాంతీయ పార్టీల హవా
ఉత్తరాది రాష్ట్రాల్లో మోడీ వైపు ప్రజలు మొగ్గు చూపడమే కాకుండా, భారతీయ జనతా పార్టీ వైపు కూడా మొగ్గు చూపారు. దక్షిణాది విషయానికి వస్తే ప్రాంతీయ పార్టీల హవా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా తమిళనాడు (డీఎంకే, అన్నాడీఎంకే), ఒడిశా (బీజేడీ), పశ్చిమ బెంగాల్ (టీఎంసీ), కేరళ, ఆంధ్రప్రదేశ్ (టీడీపీ, వైసీపీ, జనసేన), తెలంగాణ (టీఆర్ఎస్) పార్టీల వైపు మొగ్గు చూపారు.
ప్రధాని కార్యాలయంపై 75 శాతం, ప్రతిపక్షంపై 53 శాతం
పబ్లిక్ ఇనిస్టిట్యూషన్స్ విషయానికి వచ్చేసరికి ప్రధానమంత్రి కార్యాలయం పట్ల 75 శాతం మంది విశ్వాసం వ్యక్తం చేయగా, భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు పైన 73 శాతం మంది, పార్లమెంటు పైన 72 శాతం మంది విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రధాన ప్రతిపక్షం పైన కేవలం 53 శాతం మంది మాత్రమే విశ్వాసం వ్యక్తం చేశారు.