ఒక్కరే దేశాన్ని నడిపించగలరా ? మోదీపై రాహుల్ విమర్శలు
బర్గరి : సార్వత్రిక ఎన్నికలు తుది ఘట్టానికి చేరుకున్న మాటల మంటలు చల్లారడం లేదు. ప్రధాని మోదీ, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ మధ్య మాటలయుద్ధం పీక్కి చేరింది. పంజాబ్లోని బర్గరిలో బుధవారం రాహుల్ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలనే అమలు చేయలేదని దుయ్యబట్టారు. అన్నివర్గాలను మోసం చేశారని .. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అమలుతో సామాన్యుల నడ్డివిరిచారని మండిపడ్డారు. ఇన్ని చేసిన మోదీని ప్రజలు విశ్వసించరని స్పష్టంచేశారు. తమ బ్రహ్మస్త్రం ఓటుతో బుద్దిచెబుతారన్నారు.
అదేలా సాధ్యం ...
దేశం అంటే ప్రజలు, వారి చేతిలో రాజ్యాధికారం ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులని .. కానీ ప్రధాని మోదీ వారిని తక్కువ అంచనా వేస్తున్నారని రాహుల్ విమర్శించారు. తాను ఒక్కడినే దేశాన్ని నడపగలననే ధీమాతో ఉన్నారని మండిపడ్డారు. అదేలా సాధ్యమని ప్రశ్నించారు. ప్రజలను కాదని ఏం చేస్తారని నిలదీశారు. వారు ఓటేయకుంటే మీ అధికారం ఎక్కడిదని అడిగారు.
విమర్శలు తగదు ...
అలాగే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు ఫన్ అని మోదీ విమర్శించడాన్ని తప్పుపట్టారు. దేశ ప్రధానిగా రెండు పర్యాయలు పనిచేసిన నేతపై వ్యాఖ్యలు సరికావన్నారు. మీ ఐదేళ్ల టర్మ్ కొద్దిరోజుల్లో ముగుస్తోంది. తర్వాత మీరు కూడా మాజీ ప్రధాని అవుతారని .. అప్పుడు మీరు ఫన్ గా మారుతారని ధీటుగా స్పందించారు.
హామీలన్నీ బుట్టదాఖలు
రఫెల్ కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయని మరోసారి రాహుల్ ఉద్ధాటించారు. కేటాయింపులపై బహిరంగ చర్చకు సిద్ధమా అని మోదీకి మరోసారి సవాల్ విసిరారు. దీంతోపాటు జీఎస్టీ, పెద్ద నోట్ల రద్దుతో ఆర్థిక వ్యవస్థ పతనమైందని పేర్కొన్నారు. అంతేకాదు లక్షలాది యువకులు ఉద్యోగాలు కోల్పోయారని గుర్తుచేశారు. దీంతోపాటు ప్రతి ఒక్కరి ఖాతాలో రూ. 15 లక్షలు వేస్తాననే హామీ ఏమైందని ప్రశ్నించారు. నిరుద్యోగ యవతకు ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తానని మోసం చేశారని మరోసారి విమర్శించారు.