నల్లధనం ఉంటే జైలుకెళ్లవద్దు, ఫెయిర్ అండ్ లవ్లీ స్కీం: రాహుల్ సెటైర్
న్యూఢిల్లీ: ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ బుధవారం నాడు పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోడీకి మరోసారి చురకలు అంటించారు. బడ్జెట్ పైన చర్చ సందర్భంగా రాహుల్ మాట్లాడారు. ఈ సందర్భంగా నల్లధనం పైన పథకం ఫెయిర్ అండ్ లవ్లీగా ఉందని అభివర్ణించారు.
జెఎన్యు అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ఎన్నికలకు ముందు నల్లధనం పైన ప్రధాని మోడీ ఎన్నో చెప్పారన్నారు. నల్లధనం వెల్లడి పథకంపై ఆయన ఎద్దేవా చేశారు. ఆ పథకం ఫెయిర్ అండ్ లవ్లీలా ఉందన్నారు. దీని ద్వారా ఎవరైనా తమ నల్లధనాన్ని తెల్లగా మార్చుకోవచ్చన్నారు.
నల్లధనం ఉన్న వారు ఎవరూ జైలుకు వెళ్లవలసిన అవసరం లేదని, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ దగ్గరకు ఎవరైనా వస్తే ఆయనే నల్లధనాన్ని తెల్లధనంగా మారుస్తారన్నారు. ఉద్యోగ హామీలు ఏం చేశారని ప్రశ్నించారు. బలహీనవర్గాలను మోడీ ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుందన్నారు.
విద్యార్థులు, ఉపాధ్యాయులు, విలేకరులను చితక్కొట్టాలని మీ ధర్మంలో ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు. దేశానికి వ్యతిరేకంగా కన్నయ్య కుమార్ ఒక్క మాట మాట్లాడలేదన్నారు. పటియాలా హౌస్ కోర్టు వద్ద దాడి ఘటన పైన ప్రధాని మోడీ మాటమాత్రం మాట్లాడలేదన్నారు. నాగా ఒప్పందంపై ముఖ్యమంత్రులను ఎందుకు సంప్రదించలేదన్నారు.
మోడీ ఎవరి మాట వింటారో..
ప్రధాని మోడీ ఎవరి మాటను వింటారో తనకు అర్థం కావడం లేదన్నారు. ప్రజలు ఏం మాట్లాడినా ప్రధాని మౌనంగా ఉంటారని, ప్రతి పక్షాలు డిమాండ్ చేసినా మౌనంగా ఉంటారని, మరి ఆయన ఎవరికి సమాధానం చెబుతారని ప్రశ్నించారు.
ఆరెస్సెస్ అంటే స్కూల్ కాదన్న విషయాన్ని బిజెపి నేతలు గుర్తించాలన్నారు. నల్లధనం వెనక్కి తీసుకొస్తామని చెప్పిన ప్రధాని దానిని మర్చిపోయారని ఆయన తెలిపారు. పాకిస్థాన్ నేరుగా భారత్ పైన యుద్ధానికి దిగుతోందని, బిజెపి అధికారం చేపట్టిన తర్వాత నేరుగా దాడులు జరుగుతున్నాయన్నారు.
మేం ఏం చేయలేదా..
ప్రధాని మోడీ మాట్లాడితే అంతా తామే చేశామని, నలభై ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేదని చెబుతారని, ఏళ్లుగా ఏమీ చేయకుండానే దేశంలోని పలు సమస్యలు పరిష్కారమయ్యాయా? అని ఆయన ప్రశ్నించారు. నాగాలాండ్ సమస్యకు పరిష్కారం కనుగొన్నది ఎవరని ప్రశ్నించారు.
ప్రధాని మోడికి దేశంలోని సమస్యలు పట్టించుకునే తీరిక లేదన్నారు. దేశభక్తి గురించి గొప్పగా మాట్లాడే ప్రధాని మోడీ దేశంలోని సమస్యలపై స్పందించాలనే ప్రాథమిక అవగాహన లేకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు.
నవాజ్ షరీఫ్ను కలుస్తారు కానీ..
ఎలాంటి ఎజెండా లేకుండా, సరదాగా టీ తాగేందుకు 'చాయ్ పే చర్చ' పేరిట విమానం వేసుకుని పాకిస్థాన్ వెళ్లేందుకు తీరిక ఉన్న ప్రధానికి దేశంపై శ్రద్ధ లేకపోవడం బాధాకరమన్నారు. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్తో టీ తాగడానికి వెళ్తారని, ఆయన తప్పులను ఎత్తి చూపితే వారిని దేశద్రోహులుగా చిత్రీకరిస్తారన్నారు.
ప్రధానికి ఇతరులపై గౌరవం లేని పక్షంలో కనీసం ఆ పార్టీలోని సీనియర్ నేతలు అద్వానీ, మురళీ మనోహర్ జోషీ వంటి సీనియర్ల మాటలైనా వినాలని, లేదంటే జైట్లీ, సుష్మా స్వరాజ్ వంటి వారి మాటలైనా వినాలని రాహుల్ సూచించారు. ఆయన మాట్లాడుతుండగా బిజెపి నేతలు అడ్డు తగిలే ప్రయత్నం చేశారు.