ఈ నెల 18 నుంచి పార్లమెంట్ సమావేశాలు : రాష్ట్రపతి - ఉప రాష్ట్రపతి ఎన్నికల వేళ..!!
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. సమావేశాల నిర్వహణ పైన లోక్సభ, రాజ్యసభ సచివాలయాలు నోటిఫికేషన్లు జారీ చేశాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జులై 18 నుంచి ఆగస్టు 12 వరకు జరగనున్నాయి. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా పార్లమెంట్ చివరిసారిగా జనవరి 31 నుంచి ఏప్రిల్ 7 వరకు సమావేశమైంది. మొత్తం 18 పని దినాలు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇప్పటికే రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ - నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఈ నెల 18న రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. దీంతో..అదే రోజున పార్లమెంట్ సమావేశాలు ప్రారంభించాలని డిసైడ్ అయ్యారు.
తొలి రోజున రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ఎలక్టోరల్ కాలేజీలో ఓటర్లుగా ఉన్న పార్లమెంట్ సభ్యులంతా ఓటింగ్ లో పాల్గొనాల్సి ఉండటంతో ఆ రోజు నుంచే సమావేశాలను ప్రారంభిస్తున్నారు. రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి 21న ఓట్ల లెక్కింపు ఉంటుంది. 25న పార్లమెంట్ సెంట్రల్ హాల్లో నూతన రాష్ట్రపతి ప్రమాణస్వీకారం జరగనుంది. అదే విధంగా ఇప్పటికే ఉప రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి సైతం షెడ్యూల్ విడుదల అయింది. ఆగస్టు 6 ఉపరాష్ట్రపతి ఎన్నిక ఉండనుంది. ఆగస్టు 11న ఉపరాష్ట్రపతి బాధ్యతల స్వీకరణ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ రెండు ప్రధాన ఎన్నికలను పరిగణలోకి తీసుకొని పార్లమెంట్ సమావేశాల షెడ్యూల్ ఖరారు చేసారు.

ప్రస్తుత పార్లమెంట్ భవనంలో జరిగే చివరి సమావేశాలు ఇవే కానున్నాయి. నూతన పార్లమెంట్ భవన నిర్మాణం ఈ ఏడాది అక్టోబర్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోవటంతో ఈ సమావేశాలే చివరివిగా మిగిలిపోనున్నాయి. సాధ్యమైనంత వరకు శీతాకాల సమావేశాలు కొత్త భవనంలో నిర్వహించే యోచన చేస్తున్నారు. ఏదైనా అవాంతరాలు ఎదురైతే, వచ్చే బడ్జెట్ సమావేశాలు మాత్రం కొత్త భవనంలోనే ప్రారంభం కానున్నాయి. ఇక, ఈ సమావేశాల్లో అగ్నిపథ్..ఈడీ కేసుల వ్యవహారం పైన విపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్దం అవుతున్నాయి. ఇప్పటికే అగ్నిపథ్ పైన కేంద్రం ముందుకే వెళ్తున్న పరిస్థితుల్లో విపక్షాలకు దీని పైన పూర్తి క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications