మాన్సూన్ అప్డేట్: ఒడిశా, రాజస్థాన్తోపాటు ఏపీ, తెలంగాణలో అతి భారీ వర్షాలు
న్యూఢిల్లీ: ఒడిశా, తూర్పు రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ కోస్తా తీర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రాంతాలతోపాటు ఉత్తరాఖండ్, కొంకణ్, గోవా, ఛత్తీస్గఢ్, కేరళ, కర్ణాటక తీరప్రాంతం, తెలంగాణలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, గ్యాంగ్టక్, పశ్చిమబెంగాల్, పశ్చిమ రాజస్థాన్, హిమాచల్ప్రదేశ్ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచాన వేసింది. గుజరాత్, పశ్చిమ మధ్యప్రదేశ్, విదర్భ, కర్ణాటక, తమిళనాడు, మధ్య మహారాష్ట్రలలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
అండమాన్ నికోబార్ దీవుల్లో గంటకు 35-45కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశముందని తెలిపింది. అండమాన్ నికోబార్ దీవులతోపాటు పశ్చిమబెంగాల్, ఒడిశా తీర ప్రాంతాల్లో కూడా ఈదురుగాలులు వీయనున్నాయి. ఈ ప్రాంతాల్లో మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని వాతావరణ శాఖ సూచించింది.
వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో గురువారం ఉత్తర కోస్తా, తెలంగాణల్లో వర్షాలు కురిశాయి. ఈ అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా పయనించనుంది.
దీంతో రానున్న 24గంటల్లో ఉత్తర కోస్తా, ఒడిసా, తెలంగాణ, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో భారీనుంచి అతి భారీవర్షాలు కురుస్తాయని, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.