కరోనా ప్రళయం .. 59వేలకు పైగా కొత్త కేసులు, 4 లక్షల మార్కు దాటిన యాక్టివ్ కేసులు
భారతదేశంలో కరోనా కేసులు భయంకరంగా పెరిగిపోతున్నాయి . రోజురోజుకు పెరిగిపోతున్న కేసులు ఆందోళనకర పరిస్థితిని సృష్టిస్తున్నాయి. ప్రస్తుతం ఇండియాలో రోజువారీ కేసులు పెరుగుదల రికార్డ్ బ్రేక్ చేస్తున్నాయి. దీంతో మళ్ళీ లాక్ డౌన్ విధించే పరిస్థితి వస్తుందేమో అన్న ఆందోళన సర్వత్రా వ్యక్తం అవుతుంది . అయితే కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా నియంత్రణకు యుద్ధ ప్రాతిపదికన ప్రయత్నాలు చేస్తున్నాయి . అవసరం అయిన చోట మాత్రమే లాక్ డౌన్ , నైట్ కర్ఫ్యూలు విధిస్తూ పరిస్థితి అదుపు చేసే యత్నం చేస్తున్నారు .
హరిద్వార్ లో మహా కుంభమేళా .. కరోనా ఎఫెక్ట్ తో నెలరోజులే .. కోవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్ తప్పనిసరి
గత 24 గంటల్లో 59,118 కొత్త కరోనా కేసులు
తాజాగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం భారతదేశం గత 24 గంటల్లో 59,118 కొత్త కరోనా కేసులు నమోదు చేసింది . గత ఏడాది అక్టోబరు నెల నుండి ఇప్పటివరకు ఇంత భారీ స్థాయిలో కేసులు నమోదు కాలేదు.
తాజాగా పెరిగిన కేసులతో కలిపి దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య1,18,46,652 కు చేరుకుంది. కరోనా మహమ్మారి కారణంగా రోజువారీ మరణాల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది .
నాలుగు లక్షల మార్కును దాటిన యాక్టివ్ కేసులు
200కు పైగా తాజా మరణాలతో ఇప్పటివరకూ మొత్తం మరణాల సంఖ్య 160,949 కు చేరుకుంది.
కేసుల సంఖ్య విపరీతంగా పెరగడంతో యాక్టివ్ కేసులు నాలుగు లక్షల మార్కును దాటాయి అని తెలుస్తుంది. ప్రస్తుతం, క్రియాశీల కేసులు దేశంలో మొత్తం ధృవీకరించబడిన కేసులలో 3.35% ఉన్నట్లుగా సమాచారం. దేశంలో కేసులు పెరుగుతున్న వేగాన్ని బట్టి , కరోనా సెకండ్ వేవ్ , మొదటి వేవ్ కంటే చాలా ఘోరంగా ఉండొచ్చని అధికారిక డేటాను బట్టి అర్థమవుతుంది.
మహారాష్ట్ర , గుజరాత్ రాష్ట్రాలలో కరోనా బీభత్సం
ఇది గత ఏడాది నవంబర్ నాటికి నియంత్రణలోకి వచ్చినట్లు అనిపించినా మళ్ళీ క్రమంగా కేసుల పెరుగుదల, ఆందోళనకర పరిస్థితికి కారణంగా మారింది.
మహారాష్ట్ర మరియు గుజరాత్ లలో రోజువారీ కేసుల పెరుగుదల ఇప్పటికే కరోనా ఫస్ట్ వేవ్ కేసులను అధిగమించింది. పంజాబ్ కూడా విపరీతంగా కేసులను నమోదు చేస్తూ మహారాష్ట్ర గుజరాత్ ల బాటలోప్రయాణిస్తుంది. మహారాష్ట్ర, పంజాబ్, కేరళ, కర్ణాటక, చత్తీస్ గడ్ మరియు గుజరాత్ రాష్ట్రాలలో రోజువారీ కొత్త కేసులలో 81% ఉన్నట్లుగా తెలుస్తుంది.
వివిధరాష్ట్రాలలో కరోనా కఠిన ఆంక్షలు .. ఇప్పటి వరకు ఐదున్నర కోట్లకు చేరువగా కరోనా వ్యాక్సినేషన్
మహారాష్ట్ర మరియు ముంబైలలో మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి అత్యధిక కరోనావైరస్ కేసులు నమోదవుతున్నాయి. పంజాబ్, మహారాష్ట్ర, గుజరాత్ మరియు అనేక రాష్ట్రాలు లాక్డౌన్ ఆంక్షలు మరియు రాత్రి కర్ఫ్యూలను విధించి కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు విద్యా సంస్థలను బంద్ చేశాయి. వివిధ రాష్ట్రాల నుండి వచ్చే వారికి పరీక్షలు తప్పనిసరి చేశాయి. అందరూ సామాజిక దూరం పాటించాలని , మాస్కులు ధరించాలని పదేపదే ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తున్నాయి . భారతదేశం ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 5.45 కోట్లకు పైగా వ్యాక్సినేషన్ చేసినట్లుగా తెలుస్తుంది.