87 మిలియన్ ఫేస్బుక్ యూజర్ల డేటా లీక్: కేంబ్రిడ్జి ఎనలిటికా మాజీ ఉద్యోగి ప్రకటన
న్యూయార్క్: ఫేస్బుక్ యూజర్లలో సుమారు 8.7 కోట్ల మంది డేటా చోరికి గురైందని కేంబ్రిడ్జి ఎనలిటికా మాజీ ఉద్యోగి ప్రకటించారు. మంగళవారం నాడు బ్రిటన్ పార్లమెంటరీ కమిటీ ముందు హజరైన బ్రిటనీ కైసర్పై సభ్యులు ప్రశ్నలు సంధించారు.
పలు యాప్లు, సర్వేల ద్వారా కేంబ్రిడ్జి ఎనలిటికా ఎఫ్బీ యూజర్ల డేటాను చోరీ చేసేదని యూజర్ల నుండి డేటాను రాబట్టేందుకు సైకాలజీ, డేటా సైన్స్ బృందాలు సర్వేలో ప్రశ్నావళిని రూపొందిస్తాయని ఆమె పార్లమెంటరీ కమిటీకి చెప్పారు.
ప్రపంచవ్యాప్తంగా యూజర్ల డేటాను ఫేస్బుక్ విక్రయిస్తోందనే ఆరోపణలు వచ్చాయి. ఈ విషయమై ఫేస్బుక్ సీఈఓ జుకర్ బర్గ్ అమెరికన్ పార్లమెంటరీ కమిటీ ముందుకు హజరయ్యారు. కమిటీ సభ్యులు వేసిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు.
అయితే ఫేస్బుక్ యూజర్ల డేటా లీకైందనే విషయాన్ని జుకర్ బర్గ్ ఒప్పుకొన్నారు. భవిష్యత్తులో ఈ తరహ ఘటనలు జరగకుండా చూస్తామని ఆయన హమీ ఇచ్చారు. అంతేకాదు క్షమాపణలు కోరుతూ పత్రికా ప్రకటనలు కూడ గుప్పించారు.
దీంతో ఫేస్బుక్ యూజర్ల పెద్ద ఎత్తున తమ అకౌంట్లను డిలీల్ చేస్తున్నారు. ఫేస్బుక్ అకౌంట్లు డిలీట్ చేయాలనే ఉద్యమం కూడ సాగింది. ఈ తరుణంలోనే కేంబ్రిడ్జి ఎనలిటికా మాజీ ఉద్యోగి బ్రిటన్ పార్లమెంటరీ కమిటీ ముందు వెల్లడించిన అంశాలు సంచలనం కల్గిస్తున్నాయి.