తల్లికి 42.. కొడుక్కి 24 సంవత్సరాలు: ఇద్దరికీ ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగం.. ప్రేరణాత్మక కథనం!!
కేరళలో ఒక అరుదైన సంఘటన జరిగింది. కుమారుడితో పాటు ఓ తల్లి పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించి అందరి దృష్టినీ ఒక్కసారిగా ఆకర్షించింది. సాధించాలనే తపన ఉంటే ఏ వయసులోనైనా అనుకున్నది సాధించవచ్చని నిరూపించింది. ఉద్యోగ సాధనలో కుమారుడితో పాటు సాగిన తల్లి ప్రస్థానం ప్రేరణాత్మకం.
కొడుకుతో కలిసి పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించిన తల్లి
కేరళలో, మలప్పురానికి చెందిన 42 ఏళ్ల తల్లి మరియు ఆమె 24 ఏళ్ల కుమారుడు కలిసి పబ్లిక్ సర్వీస్ కమిషన్ (పిఎస్సి) పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. కేరళ మలప్పురానికి చెందిన 42 సంవత్సరాల బిందు, ఆమె కుమారుడు 24 సంవత్సరాల వివేక్ ఇద్దరు కలిసి ఒకేసారి కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలను రాశారు. ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలన్న బిందు కల ఇన్నేళ్ల తర్వాత కొడుకుతో పాటు నిజమైంది.
కొడుకుతో కలిసి చదువుకున్న తల్లి .. ఇద్దరికీ ఉత్తీర్ణత
బిందు, వివేక్ ఇద్దరూ కలిసి కోచింగ్ క్లాసులకు హాజరయ్యారు. ఇంటి దగ్గర కూడా ఇద్దరూ కలిసి కంబైన్డ్ స్టడీ చేశారు. కోచింగ్ సెంటర్ లోని అధ్యాపకులు కూడా ఎంతో పట్టుదలతో చదువుతున్న తల్లీ, కొడుకులను ప్రోత్సహించారు. ఇక ఫైనల్ గా కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలలో తల్లీ కొడుకులిద్దరూ ఉత్తీర్ణత సాధించారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలలో బిందు ఎల్జిఎస్ జాబితాలో 92వ ర్యాంక్ సాధించారు. ఇక ఆమె కుమారుడు వివేక్ ఎల్డీసీ జాబితాలో 38వ ర్యాంకు సాధించారు.
అరీకోడ్ లో అంగన్ వాడీ టీచర్ గా బిందు, ఆమె భర్త ఆర్టీసీ డ్రైవర్
బిందు గత 11 ఏళ్ల నుంచి ఆరీకోడ్లో అంగన్వాడీ టీచర్ గా పని చేస్తున్నారు. ఆమెకు 2019-20లో ఉత్తమ అంగన్వాడీ టీచర్గా రాష్ట్ర ప్రభుత్వ అవార్డు లభించింది. అంగన్ వాడీ టీచర్ గా అక్కడితో ఆగిపోలేదు బిందు. ఉన్నత స్థానానికి ఎదగటం కోసం తీవ్రంగా కృషి చేసింది. ఆమె ఇప్పటి వరకు రెండు సార్లు పీఎస్సీ పరీక్షలు రాశారు. బిందు ఐ సి డి సి సూపరింటెండెంట్ పరీక్ష కూడా రాస్తున్నారు. బిందు భర్త చంద్రన్ కేరళ రాష్ట్ర ఆర్టీసీలో మలప్పురం జిల్లాలో ఎడప్పల్ డిపో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. వీరికి కూతురు హృద్య ఉన్నారు.
ఒకేసారి ఉద్యోగం రావటంపై తల్లీ కొడుకుల సంతోషం
ఇక ఇద్దరూ ఒకేసారి ఉత్తీర్ణత సాధించడం పై తల్లీకొడుకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తనతో పాటు తన తల్లికి కూడా ఉద్యోగం రావడం సంతోషంగా ఉందని కుమారుడు వివేక్ చెబుతున్నారు. ఇక తల్లి కూడా తన కొడుకుతో పాటు తనకు ఉద్యోగం వచ్చిందని ఉబ్బి తబ్బిబ్బు అవుతోంది. మొత్తానికి ఈ వార్త కేరళ రాష్ట్రంలో ఆసక్తికర చర్చకు కారణం గా మారింది.
జనాలలో ఆసక్తి.. పరీక్షలు రాసిన తల్లి వయసుపై ఆరా..
తల్లీకొడుకులు ఇద్దరికీ ఒకేసారి ఉద్యోగం రావటం ఏమిటి అంటూ బిందు వయసును ఆరా తీస్తున్నారు. ఇంత వయసులో బిందు పిఎస్సి పరీక్షకు ఎలా హాజరయ్యింది అని చాలా మంది దీనిపై చర్చిస్తున్నారు. కేరళలోని స్ట్రీమ్-2 పోస్టులకు గరిష్ట వయస్సు 40 సంవత్సరాలు, కానీ కొన్ని వర్గాలకు కొన్ని సడలింపులు ఉన్నాయి. ఓబీసీ కేటగిరీలో మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ మరియు వితంతువులకు ఐదేళ్లు సడలింపు ఇచ్చారు . వికలాంగులకు సడలింపు 15 సంవత్సరాలు, వికలాంగులకు ఆర్థోపెడికల్గా ఉన్న వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఇచ్చారు.