హెడ్ కానిస్టేబుల్ రమాశంకర్ పాడెను మోసిన సీఎం
భోపాల్ : సిమీ ఉగ్రవాదుల చేతిలో బలైపోయిన భోపాల్ సెంట్రల్ జైలు హెడ్ కానిస్టేబుల్ రమాశంకర్ యాదవ్ భౌతికకాయానికి నేటి ఉదయం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియలకు ముందు నిర్వహించిన అంతిమయాత్ర సందర్బంగా వేలాదిమంది ప్రజలు తరలివచ్చారు.
అంతిమయాత్రకు హాజరైన మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్.. రమాశంకర్ పాడెను మోయడం గమనార్హం. రమాశంకర్ కు నివాళి అర్పించిన ఆయన రమాశంకర్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఉగ్రవాదులతో పోరాడి రమాశంకర్ దేశం కోసం ప్రాణ త్యాగం చేశారని కొనియాడారు.
రమాశంకర్ కుటుంబాన్ని ఆదుకుంటామని హామి ఇచ్చిన శివరాజ్ సింగ్ చౌహాన్.. అతని కుటుంబానికి రూ.10లక్షల పరిహారంతో పాటు కుమార్తె పెళ్లి కోసం మరో రూ.5లక్షల ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపారు. అలాగే రమాశంకర్ నివసిస్తోన్న కాలనీకి ఆయన పేరే పెట్టనున్నామని ప్రకటించారు. ఉగ్రవాదుల విషయాలను రాజకీయం చేయాలనుకోవడం తగదని, కొంతమంది నేతలు ఉగ్రవాదుల విషయాన్ని కూడా ఓటు బ్యాంకు దృష్టితోనే చూస్తున్నారని మండిపడ్డారు.