షాక్: లోక్సభ లాబీలోనే బెదిరించాడు -ఎంపీ నవనీత్ కౌర్ సంచలనం -చిక్కుల్లో సేన ఎంపీ సావంత్ -మహా డ్రామా
రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలు, బాంబు బెదిరింపుతో మొదలైన కలకలం రోజుకో మలుపు తిరుగుతూ మహారాష్ట్ర ప్రభుత్వం పీకలమీదికొచ్చింది. అంబానీ 'బాంబు' కేసుతోపాటు థానే వ్యాపారి మన్సుఖ్ హిరేన్ హత్య కేసులోనూ ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ పోలీస్ అధికారి సచిన్ వాజే వ్యవహారం పార్లమెంటునూ కుదిపేసింది. నేరచరితుడైన సచిన్ వాజేతో మహారాష్ట్ర మంత్రులకు లింకులు ఉన్నాయని వెల్లడికావడం సభ దద్దరిల్లింది. ఈ క్రమంలో ఉద్ధవ్ సర్కారుపై మాట్లాడినందుకు పార్లమెంటు సాక్షిగా బెదిరింపులు ఎదురయ్యాయని స్వతంత్ర ఎంపీ నవనీత్ కౌర్ రాణా బాంబు పేల్చారు.

అరుదైన సంఘటన..
పార్లమెంట్ చరిత్రలోనే అరుదైన సంఘటనగా ఎంపీ నవనీత్ రాణా సంచలన ఆరోపణలు చేశారు. మహారాష్ట్రలోని అమరావతి లోక్ సభ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ ఎంపీగా కొనసాగుతోన్న ఆమె.. పార్లమెంటులోపలే తనకు బెదిరింపులు వచ్చాయన్నారు. సోమవారం సెషన్ ముగిసిన తర్వాత లోక్ సభ లాబీలో తాను ఎదుర్కొన్న భయానక అనుభవాన్ని వివరిస్తూ, సదరు బాధ్యులపై చర్చలు తీసుకోవాలని స్పీకర్ ఓం బిర్లాకు నవనీత్ ఫిర్యాదు చేశారు. అదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషిలకు కూడా ఫిర్యాదు లేఖలు పంపారు.

ఎలా తిరుగుతావో చూస్తా..
ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ సచిన్ వాజే వ్యవహారంపై లోక్ సభలో మాట్లాడుతూ ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినందుకుగానూ బెదిరింపులు వచ్చాయని స్వతంత్ర ఎంపీ నవనీత్ రాణా ఫిర్యాదు చేశారు. మాజీ కేంద్ర మంత్రి, ప్రస్తుత శివసేన ఎంపీ అర్వింద్ సావంత్ లోక్ సభ లాబీలోనే బెదిరించాడని ఆమె అన్నారు. ''మహారాష్ట్రలో ఎలా తిరుగుతావో చూస్తానంటూ ఆయన కళ్లెర్రజేశాడు. జైలులో పడేస్తానని కూడా బెదిరించాడు. ప్రజాస్వామిక దేవాలయమైన పార్లమెంటులో నాకు ఎదురైన ఈ బెదిరింపులు మొత్తం మహిళా లోకానికే అవమానం. వీలైనంత త్వరగా సావంత్ పై చర్యలు తీసుకోండి'' అని స్పీకర్ కు రాసిన ఫిర్యాదు లేఖలో నవనీత్ పేర్కొన్నారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే..

ఆమెను అనాల్సిన అవసరమేంటి?
మహారాష్ట్ర కేబినెట్ మంత్రులకు క్రిమినల్ పోలీసుతో లింకుందని, నాడు ఫడ్నవిస్ (బీజేపీ) సర్కారు పక్కన పెట్టిన అధికారుల్ని ఠాక్రే సీఎం అయ్యాక మళ్లీ తీసుకొచ్చారని, ఈ విషయంలో మంత్రి దేశ్ ముఖ్ నిందార్హుడేననని అమరావతి ఎంపీ నవనీత్ రాణా లోక్ సభలో అన్నారు. కాగా, నవనీత్ ఆరోపణలను శివసేన ఎంపీ అరవింద్ సావంత్ ఖండించారు. ఆమెను తానెందుకు భయపెడతానని ప్రశ్నించారు. ఆమె వ్యవహార శైలి, స్పందించే విధానం ఏమీ బాగాలేదని అన్నారు. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కరోనాకు గురై ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నందున ఫిర్యాదు పరిశీలన ఆలస్యమయ్యే అవకాశముంది. కాగా,

సుడిగుండంలో అగాధి ప్రభుత్వం..
అవినీతి, అక్రమ ఎన్ కౌంటర్ కేసుల్లో సస్పెండై, వీఆర్ఎస్ కూడా తీసుకున్న సచిన్ వాజేను శివసేన ప్రభుత్వం మళ్లీ సర్వీసుల్లోకి తీసుకోవడం అనూహ్య పరిణామాలకు దారి తీసింది. కరోనా సమయంలో 50ఏళ్లు దాటిన సిబ్బందికి మినహాయింపులిచ్చే క్రమంలో పాత అధికారులు కొందరిని మహా సర్కారు తిరిగి విధుల్లోకి తీసుకుంది. అలా రీఎంట్రీ ఇచ్చిన సచిన్ వాజేను మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ విపరీతంగా వాడేశారని, నెలకు రూ.100 కోట్లు వసూలు చేయాల్సిందిగా టార్గెట్ విధించారని ముంబై మాజీ కమిషనర్ పరమ్ వీర్ సింగ్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం సంచలనంగా మారింది. దేశ్ ముఖ్ ఎన్సీపీకి చెందిన నేత కావడంతో ఈ వ్యవహారంలో ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్ మధ్య అభిప్రాయ బేధాలొచ్చాయి. మరోవైపు..

పరమ్వీర్ వెనుక బీజేపీ హస్తం
ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న అంబానీ 'బాంబు' కేసు, హిరేన్ హత్య కేసు, ఆ రెండిటిలో ముద్దాయిగా ఉన్న మాజీ పోలీస్ అధికారి సచిన్ వాజే వ్యవహారం, హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ చెబితేనే వాజే అక్రమాలకు పాల్పడ్డాడని మరో పోలీస్ అధికారి పరంవీర్ సింగ్ ఏకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించడం తదితర పరిణామాలతో మహారాష్ట్ర అట్టుడుకుతోంది. హోం మంత్రి అనిల్ పై ఆరోపణలు చేసిన ఐపీఎస్ పరంవీర్ ఢిల్లీలో బీజేపీ పెద్దలను కలిశారని, ఆ తర్వాతే నాటకానికి తెరలేపారని ఎన్సీపీకే చెందిన మరో కీలక నేత, మమారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ అన్నారు. సమయం వచ్చినప్పుడు సింగ్-బీజేపీల కుట్ర తాలూకు ఆధారాలను బయటపెడతానని మాలిక్ అన్నారు.












Click it and Unblock the Notifications