ఎంపీలకు ఈడీ సమన్లపై తేల్చేసిన వెంకయ్య నాయుడు: ఆ కీలక వ్యాఖ్యలతో
న్యూఢిల్లీ: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల దాడులు రోజురోజుకూ తీవ్రతరం అవుతోన్నాయి. ఇదివరకు నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధినేత్రి సోనియా గాంధీని ఇటీవలే ఈడీ అధికారులు వరుసగా మూడు రోజుల పాటు విచారించారు. పశ్చిమ బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఉద్వాసనకు గురైన మంత్రి పార్థ ఛటర్జీ, ఢిల్లీలో ఆమ్ఆద్మీ పార్టీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్ అయ్యారు. విచారణను ఎదుర్కొంటోన్నారు.

ఈడీ దాడులతో..
తాజాగా మహారాష్ట్రలో శివసేన (ఉద్ధవ్ థాకరే వర్గం) రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ను అరెస్ట్ చేయడం.. ఈడీ అధికారుల దాడుల తీవ్రతకు అద్దం పట్టింది. పట్ర చాల్ భూ కుంభకోణం కేసులో ఆయన అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం ఈడీ అధికారుల కస్టడీలో ఉన్నారు. గురువారం నాడే ఆయన కస్టడీ ముగిసినప్పటికీ.. దీన్ని మళ్లీ పొడిగించింది న్యాయస్థానం. సోమవారం వరకూ కస్టడీలో ఉండేలా ఉత్తర్వులు జారీ చేసింది.

మల్లికార్జున ఖర్గే కూడా..
నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే కూడా ఈడీ అధికారుల విచారణకు హాజరైన విషయం తెలిసిందే. సుమారు ఆరుగంటల పాటు అధికారులు ఆయనను విచారించారు. కొత్త సమన్లనేవీ జారీ చేయకపోవడంతో ఆయన ఊపిరి పీల్చుకున్నారు. పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్న సమయంలో ఈడీ అధికారులు సమన్లను ఇవ్వడం, విచారణకు హాజరు కావాలంటూ ఆదేశించడాన్ని ఆయన తప్పు పట్టారు.

స్పందించిన వెంకయ్య నాయుడు..
దీనిపై రాజ్యసభ ఛైర్మన్ ఎం వెంకయ్య నాయుడు స్పందించారు. పార్లమెంట్ సమావేశాలు ఉన్నా, లేకపోయినా.. దర్యాప్తు ఏజెన్సీల నుంచి సమన్లను అందుకున్న సభ్యులు దానికి లోబడే ఉండాలని స్పష్టం చేశారు. చట్టానికి ఎవరూ అతీతులు కారని పేర్కొన్నారు. చట్టాలు, లీగల్ ప్రొసీజర్లను గౌరవించాల్సిన బాధ్యత.. సమన్లను అందుకున్న సభ్యులపై ఉందని వ్యాఖ్యానించారు. పార్లమెంట్ సభ్యులు కూడా చట్టం, న్యాయానికి లోబడి ఉన్న పౌరులేనని అన్నారు.

సోనియా, రాహుల్ గాంధీ, ఖర్గే..
నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో ఈడీ అధికారులు సోనియా గాంధీ, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని విచారించినప్పటికీ.. ఎలాంటి సాక్ష్యాధారాలను రాబట్టుకోలేకపోయారు. నేషనల్ హెరాల్డ్ విషయంలో దివంగత పార్టీ నాయకులు మోతీలాల్ వోహ్రా, అహ్మద్ పటేల్ ప్రమేయం ఉందంటూ సాక్ష్యాధారాలతో సహా సోనియాగాంధీ నిరూపించడం వల్ల ఆమెపై తదుపరి చర్యలను తీసుకోలేకపోయారనేది స్పష్టమౌతోంది. దీనితో వారు ఈ కేసులో ముందుకు వెళ్లలేకపోయారు. దీనితో మల్లికార్జున ఖర్గేను వారు విచారించారు. నేషనల్ హెరాల్డ్ ప్రధాన కార్యాలయాన్నీ సీజ్ చేశారు.












Click it and Unblock the Notifications