మోడీ వ్యాఖ్యలు: ‘జైట్-లై’ థ్యాంక్స్ అంటూ రాహుల్ వ్యంగ్యాస్త్రాలు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్పై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యల అంశంపై కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ చేసిన ప్రకటనను రాహుల్ ఎద్దేవా చేశారు.
జైట్లీని.. 'జైట్-లై(అబద్ధాలు)' అని అభివర్ణించిన రాహుల్.. ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 'జైట్లీ గారూ మీకు ధన్యవాదాలు. మన ప్రధాని చెప్పిన పనులు అస్సలు చేయరని మీరు ఒప్పుకున్నందుకు సంతోషం' అని వ్యాఖ్యానించారు.
అంతేగాక, బీజేపీ అబద్ధాల కోరుల పార్టీ అని బుధవారం ట్వీట్ చేశారు. గుజరాత్ ఎన్నికల ప్రచార సభలో మోడీ ప్రసంగాన్ని.. రాజ్యసభలో జైట్లీ మాట్లాడిన మాటల వీడియోలను పక్కపక్కనే ఉంచి మరో ట్వీట్ చేశారు రాహుల్.
కాగా, మాజీ ప్రధాని మన్మోహన్, మాజీ ఉపరాష్ట్రపతి హమిద్ అన్సారీ గురించి ప్రధాని మోడీ ఎప్పుడూ తక్కువ చేసి మాట్లాడలేదని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ రాజ్యసభలో తెలిపారు. గుజరాత్ ఎన్నికల్లో పాక్ జోక్యం చేసుకుంటున్నదని, మాజీ ప్రధానితో పాటు ఇతర నేతలు కూడా ఆ కుట్రలో పాలుపంచుకుంటున్నారని ఇటీవల ప్రధాని మోడీ ఆరోపణలు చేశారు. దీంతో ఆ అంశాన్ని పార్లమెంట్లో గత కొన్ని రోజులుగా విపక్షాలు లేవనెత్తుతూనే ఉన్నాయి.
Dear Mr Jaitlie - thank you for reminding India that our PM never means what he says or says what he means. #BJPLies pic.twitter.com/I7n1f07GaX
— Office of RG (@OfficeOfRG) December 27, 2017
ప్రధాని తన వ్యాఖ్యల పట్ల వివరణ ఇవ్వాలని విపక్షాలు సభలను స్తంభింపచేశాయి. ఈ నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం రాజ్యసభలో అరుణ్ జైట్లీ స్పందించారు. ఎన్నికల ప్రచారంలో మాజీ ప్రధాని మన్మోహన్ నైతికతను ప్రధాని మోడీ ప్రశ్నించలేదని జైట్లీ తెలిపారు. అలాంటి భావనలు తప్పు అని అన్నారు.
మాజీ ప్రధాని మన్మోహన్, మాజీ ఉపరాష్ట్రపతి హమిద్ అన్సారీలను అత్యున్నతంగా గుర్తిస్తామన్నారు. వారిని అత్యున్నతంగా గౌరవిస్తామని, వారి దేశభక్తిని శంకించడంలేదని జైట్లీ స్పష్టం చేశారు. కాగా, ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యల పట్ల జైట్లీ వివరణ ఇచ్చినందుకు ప్రతిపక్ష నేత గులామ్ నబీ ఆజాద్ కృతజ్ఞతలు తెలిపారు. గుజరాత్ ఎన్నికల సమయంలో తమ పార్టీ ఏదైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే.. వాటిని వెనక్కి తీసుకుంటున్నామని, ఇక ముందు ఇలాంటి వ్యాఖ్యలు చేయరాదని భావిస్తున్నామని ఆయన చెప్పారు.