మగాళ్లు తప్పు చేస్తారు, ఉరేయాలా: రేప్పై ములాయం
లక్నో: మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత ములాయం సింగ్ యాదవ్ వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. అత్యాచార నిరోధక చట్టాన్ని ఆయన గురువారం వ్యతిరేకించారు. అత్యాచారానికి పాల్పడినవారికి ఉరిశిక్ష వేసే చట్టాన్ని తాము మార్చేస్తామని ఆయన అన్నారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొరాదాబాద్ ఎన్నికల ప్రచార సభలో ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు. అత్యాచార నిందితులకు ఉరిశిక్ష వేయకూడదని ఆయన అన్నారు. మగాళ్లు తప్పులు చేస్తారని ఆయన అన్నారు. ముంబైలో జరిగిన రెండు సామూహిక అత్యాచారం కేసుల్లో ముగ్గురు దోషులకు కోర్టు ఉరిశిక్ష విధించడానన్ని ఆయన ప్రస్తావించారు.

అత్యాచారాల కేసుల్లో ఉరిశిక్షలు వేయాల్సిందేనా అని ఆయన అడిగారు. వాళ్లు కుర్రాళ్లని, వారు తప్పులు చేస్తారని ఆయన అన్నారు. అత్యాచార నిరోధక చట్టాన్ని దుర్వినియోగం చేసేవారిపై న్యాయపరమైన చర్యకు సంబంధించిన నిబంధన ఉండాలని ఆయన అన్నారు
ములాయం సింగ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపే అవకాశం ఉంది. ముంబైలో ఓ మహిళా జర్నలిస్టుపై, ఓ టెలిఫోన్ ఆపరేటర్పై సామూహిక అత్యాచారాలు జరిపిన కేసుల్లో కోర్టు ముగ్గురికి మరణశిక్ష విధిస్తూ గతవారమే తీర్పు చెప్పింది.












Click it and Unblock the Notifications