ముల్లా ఒమర్ మృతి: మరోసారి పాక్ అబద్ధం
ఇస్లామాబాద్: తాలిబన్ సుప్రీం కమాండర్ ముల్లా ఒమర్ మృతిపై పాకిస్థాన్ మరోసారి అబద్ధం చెప్పింది. 2013లోనే పాకిస్థాన్లోని కరాచీలో ముల్లా ఒమర్ మృతి చెందాడని ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వం ఇప్పటికే పేర్కొంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఒమర్.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడని తెలిపింది.
అయితే పాకిస్థాన్లో ముల్లా ఒమర్ లేడని.. ఒసామా బిన్ లాడెన్ విషయంలో చెప్పిన అబద్ధాన్నే పాక్ కొనసాగిస్తోంది. అంతేగాక, దావూద్ ఇబ్రహీం కూడా పాకిస్థాన్ లేడని వాదిస్తోంది. కాగా, ఒసామా బిన్ లాడెన్, ముల్లా ఒమర్లు పాకిస్థాన్ను సురక్షిత ప్రాంతంగా మలుచుకున్నారు.
పాక్ కూడా వీరికి కావాల్సిన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. ఐఎస్ఐలోని ప్రత్యేక విభాగం ఒమర్, లాడెన్ల వ్యవహారాలను పర్యవేక్షించేదని పాకిస్థాన్లో పర్యటించిన అమెరికాకు చెందిన పలువురు జర్నలిస్టులు పేర్కొన్నారు. వారిని ఆస్తిగా పరిగణించి పాకిస్థాన్ వారికి తగిన భద్రత కల్పించేదని పేర్కొన్నారు.
కాగా, ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వం మాత్రం ముల్లా ఒమర్ మృతి చెందాడని అధికారిక పూర్వకంగా చెబుతోంది. గతంలో ఇచ్చిన వార్తలు నిజం కాకపోవచ్చు గానీ, ఇప్పుడు చెప్పిన సమాచారం వాస్తవమని తెలిపారు.
బుధవారం బిబిసిలో వచ్చిన కథనం ప్రకారం.. తాలిబన్ నేత ముల్లా ఒమర్ మృతి చెందాడని ఆప్ఘనిస్థాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఒమర్ 2013లో కరాచీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే ఈ విషయంపై తాలిబన్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఒమర్ మృతిని తాలిబన్ నేతలెవరూ ఖండించలేదు కూడా.
కాగా, ముల్లా ఒమర్ స్థానంలో కొత్తగా ఎవరినైనా నియమించాలని తాలిబన్ భావిస్తున్నట్లు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో ఒమర్ మృతి చెంది ఉంటాడని అమెరికా నిఘా వర్గాలు భావిస్తున్నాయి. 9/11 అమెరికా దాడుల తర్వాత ఒమర్.. తాలిబన్ కార్యకలాపాల్లో కనిపించలేదని ఆఫ్ఘనిస్థాన్ తెలిపింది.
ఒమర్ మృతితో తాలిబన్ నాయకత్వ లేమితో సతమతమవుతోందని తెలుస్తోంది. బిన్ లాడెన్ తర్వాత ఆల్ఖైదా ఎలాగైతే విచ్ఛిన్నమైందో.. తాలిబన్ కూడా అదే తరహాలో నిర్వీర్యమయ్యే పరిస్థితిని ఎదుర్కొంటోంది. అందుకే, కొత్త అధిపతిని నియమించే వరకు ఒమర్ మృతిని రహస్యంగా ఉంచాలని తాలిబన్ భావించినట్లు తెలుస్తోంది. ఒమర్ పాకిస్థాన్లో చనిపోయిన కారణంగా ఈ విషయాన్ని పాక్ కూడా గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నిస్తోంది.