పేలుడు, ముగ్గురు మృతి: పట్టాలపై పడినా.. ముంబైలో మిరాకిల్
ముంబై: గ్రేటర్ ముంబై నగర పరిధిలోని థానే జిల్లాలోని డాంబివాలేలో ఓ రసాయన పరిశ్రమలో పేలుడు సంభవించి భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, వంద మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
రసాయన పరిశ్రమలోని బాయిలర్లో పేలుడు కారణంగా మంటలు చెలరేగినట్లు భావిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది సహాయకచర్యలు చేపడుతున్నారు. ఈ కర్మాగారం ఎంఐడీసీ ఫేస్-2లో ముంబైకి 50కి.మీల దూరంలో ఉంది. కర్మాగారం నుంచి 3 నుంచి 4 కి.మీల వరకు పేలుడు శబ్దాలు వినిపించాయి. ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.

ముంబైలో మిరాకిల్!
ముంబైలో మిరాకిల్ జరిగింది. అదృష్టం కొద్ది 60 ఏళ్ల ముంబై మహిళ మృత్యువు నుంచి తప్పించుకుంది. ప్రమీల బాబన్ పోఖర్కార్ అనే మహిళ రైలు ప్రమాదం నుంచి అనూహ్యంగా బయటపడింది. ఘట్కోపర్ రైల్వే స్టేషన్లో బుధవారం ఈ సంఘటన జరిగింది.

60 ఏల్ల సదరు మహిళ ప్లాట్ ఫాం మీద నుంచి పట్టాల పైన పడింది. అదే సమయంలో లోకల్ రైలు పట్టాలపైకి వచ్చింది. డ్రైవర్ ఆమెను గమనించి బ్రేకు వేసే లోపల రెండు బోగీలు ఆమె పై నుంచి వెళ్లాయి. ఆమెకు ఏమైందోనని అందరూ కంగారు పడ్డారు.

కానీ గాయాలతో బయటపడింది. ఎడమ కాలి వేలుకు గాయం కావడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. రెండు బోగీలు మీదనుంచి వెళ్లినా ఆమె ప్రాణాలతో బయటపడింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.












Click it and Unblock the Notifications