ముంబైలోని భవంతిలో భారీ అగ్నిప్రమాదం
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో గురువారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దక్షిణ ముంబైలోని కోలాబా ప్రాంతంలో గల రీగల్ సినిమా వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. భవంతిలోంచి దట్టమైన పొగలు రావడం కనిపించింది.
సంఘటనా స్థలానికి ఎనిమిది ఫైర్ టెండర్స్ చేరుకున్నాయి. మంటలను ఆర్పే ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రమాద స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
అగ్ని ప్రమాదం నుంచి ఇద్దరు వ్యక్తులను రక్షించినట్లు డిసిపి మనోజ్ శర్మ చెప్పారు. కొలాబాలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. రీగల్ సినిమా స్థానికులకే కాకుండా పర్యాటకులకు కూడా ఇష్టమైంది.
మంటలు భవనం పై అంతస్థుల్లో ప్రారంభమై పైకి ఎగబాకినట్లు భావిస్తున్నారు. కొలాబా కాజ్వేను మూసేశారు. ఆ దారిలో రాకపోకలను అనుమతించడం లేదు. సాక్షులు దానికి సంబంధించిన వీడియోలను ట్విట్టర్లో పోస్టు చేశారు. ముందు జాగ్రత్తగా పక్కనున్న భవనాలను ఖాళీ చేయిస్తున్నారు.