కరోనా నిబంధనలు పాటించకపోతే లాక్డౌన్ తప్పదు... ముంబై ప్రజలకు మేయర్ హెచ్చరిక
ముంబైలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. గురువారం(మార్చి 25) కొత్తగా మరో 5504 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 14 మంది కరోనాతో మృతి చెందారు. కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో ఆస్పత్రులపై ఒత్తిడి పెరుగుతోంది. దీంతో ప్రస్తుతం ముంబైలో ఆస్పత్రుల్లో కరోనా పేషెంట్ల కోసం కేటాయించిన 13,773 పడకలను 21వేలకు పెంచుతున్నట్లు బృహన్ ముంబై కార్పోరేషన్ ప్రకటించింది.
ముంబై ప్రజలు తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించాలని... లేనిపక్షంలో లాక్డౌన్ తప్పదని మేయర్ కిశోరీ పెడ్నేకర్ హెచ్చరించారు. ప్రజలు కరోనా నిబంధనలు పాటించకపోవడం... పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో లాక్డౌన్,రాత్రిపూట కర్ఫ్యూ గురించి ఆలోచించాల్సి వస్తోందన్నారు. చాలామంది క్వారెంటైన్,ఐసోలేషన్ నిబంధనలు పాటించకపోవడం కూడా వైరస్ వ్యాప్తికి కారణమవుతోందని చెప్పారు.ముంబైలో ప్రస్తుతం 39 యాక్టివ్ కంటోన్మెంట్ జోన్లు కొనసాగుతున్నాయని... కరోనా కేసులు బయటపడ్డ 432 భవనాలను మూసివేశామని తెలిపారు.

ప్రస్తుతం ముంబైలో పరిస్థితి బాగాలేదని... అయితే ప్రజలు ఆందోళన చెందాల్సిన పని లేదని అన్నారు. అందుకు తగిన విధంగా వైద్య వ్యవస్థను సిద్దం చేస్తున్నామని చెప్పారు.రాబోయే రోజుల్లో రోజుకు 60వేల కరోనా టెస్టులు చేయాలని నిర్ణయించినట్లు ముంబై మేయర్ వెల్లడించారు. గురువారం నాటికి ముంబైలో 10లక్షల వ్యాక్సిన్లు పంపిణీ చేశామని... రాబోయే రోజుల్లో రోజుకు 1లక్ష టీకాలు వేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. వ్యాక్సిన్ ద్వారానే కరోనా మహమ్మారిని అంతం చేయగలమని అన్నారు.
కాగా,దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 53,476 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 11,787,534కి చేరింది. ఇప్పటివరకూ 1,60,726 మంది కరోనాతో మృతి చెందారు. తాజా కేసుల్లో ఒక్క మహారాష్ట్రలోనే 31,855 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం కేసుల సంఖ్య 25,64,881కి చేరింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇప్పటికే లాక్డౌన్ అమలవుతున్న సంగతి తెలిసిందే. కొన్ని ప్రాంతాల్లో రాత్రిపూట కర్ఫ్యూ అమలుచేస్తున్నారు.












Click it and Unblock the Notifications