ముంబైలోనూ స్కూళ్ల మూసివేత-31 వరకూ పదోతరగతి మినహా మిగతా క్లాసులు బంద్
మహారాష్ట్రలో కోవిడ్ కల్లోలం అంతకంతకూ పెరుగుతోంది. దేశవ్యాప్తంగా అత్యధిక కేసులు మహారాష్ట్రలోనే నమోదవుతున్నాయి. ముంబైలో పరిస్ధితి మరీ దారుణంగా ఉంది. దీంతో ముందుగా విద్యార్ధులకు ఎలాంటి ముప్పు లేకుండా విద్యాసంస్ధలు మూసేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బృహన్ ముంబై కార్పోరేషన్ ( బీఎంసీ) ఆదేశాలు జారీ చేసింది.
Recommended Video
విద్యాసంస్ధల్లో 1 నుంచి 9వ తరగతి వరకూ, అలాగే 11వ తరగతి విద్యార్ధులకు తరగతులు నిర్వహించరాదని బీఎంసీ నిర్ణయించింది. కేవలం 10, 12 తరగతుల విద్యార్ధులకు మాత్రమే ప్రస్తుతానికి క్లాసులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో మిగతా విద్యార్దులంతా కోవిడ్ సమయంలో ఉన్నట్లుగానే ఇళ్లకు పరిమితం కావాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి జనవరి 31 వరకూ స్కూళ్లను మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఆ తర్వాత పరిస్దితిని బట్టి సమీక్షించి నిర్ణయం తీసుకుంటారు.

ప్రస్తుతం దేశంలోనే అత్యధిక కోవిడ్ కేసులు మహారాష్ట్రలో నమోదవుతున్నాయి. ఇప్పటికే 500కు పైగా ఓమిక్రాన్ కేసులు మహారాష్ట్రలో నమోదయ్యాయి. దీంతో ఈ ప్రభావం రాజధాని ముంబైపై పడుతోంది. ముంబైలోని మురికివాడల్లోనూ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తొలుత ముంబైలో స్కూళ్ల మూసివేత నిర్ణయం తీసుకుంది. పరిస్ధితిని బట్టి రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్ల మూసివేత నిర్ణయం ప్రకటించే అవకాశాలూ లేకపోలేదు. ఇప్పటికే ముంబైతో పాటు మహారాష్ట్రలో రాత్రిపూట కర్ఫ్యూ కొనసాగుతోంది. పరిస్ధితి మారకపోతే పగటి పూట ఆంక్షలు విధించేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది.












Click it and Unblock the Notifications