'హత్య'కు గురైన యువతి ప్రియుడితో కనిపించింది
పింకి దేవి అనే ఆ యువతిని గిరిధ్ పోలీసులు సోమవారంనాడు చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. కోర్టు ఆమెకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. కుట్రకు సంబంధించిన అభియోగాలు మోపి ఆమెను పోలీసులు అరెస్టు చేశారు.
ఆమెను హత్య చేశారనే ఆరోపణపై ఆమె భర్త అరుణ్ రాణా (28), ఆమె ఏత్తామామలు 2011 నుంచి రెండేళ్ల పాటు జైలులో ఉన్నారు. ప్రస్తుతం 23 ఏళ్ల వయస్సు ఉన్న పింకి 2010 జూన్లో అరుణ్ను పెళ్లి చేసుకుంది. అకస్మాత్తుగా ఆమె 2011 మే 26వ తేదీన బిలాస్పూర్ రైల్వే స్టేషన్లో తప్పిపోయింది. అరుణ్ రాణా, ఆమె నాగపూర్ వెళ్లడానికి బయలుదేరిన సమయంలో ఇది చోటు చేసుకుంది.
అరుణ్ జిఆర్పికి విషయాన్ని చెప్పాడు. ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం దక్కలేదు. పింకి కుటుంబ సభ్యులు కూడా ఆమె కోసం వెతికారు. అరుణ్ తమ కూతురిని చంపి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తూ పింకి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పింకిని అరుణ్, అతని కుటుంబ సభ్యులు వేధిస్తుండేవారని వారు ఆరోపించారు. దాంతో పోలీసులు అరుణ్ రాణాను, అరుణ్ అన్నయ్య భార్య గుడియా దేవిని, తల్లి రామ్నీ దేవిని, తండ్రి నును రాణాను 2012 అక్టోబర్ 16వ తేదీన అరెస్టు చేసారు.
అయితే, పింకి తన ప్రియుడు ఉండే వారాణాసికి వెళ్లింది. అక్కడే ఉంటూ ఓ బిడ్డకు తల్లి కూడా అయింది. ఇటీవల బెయిల్పై బయటకు వచ్చిన నును రాణాకు పింకి ఉత్తరప్రదేశ్లో తన ప్రియుడితో ఉంటోందని తెలిసింది. దాంతో అతను గిరిధ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
పింకి నిజానికి తన ప్రియుడిని పెళ్లి చేసుకోవాలని అనుకుంది. కానీ తల్లిదండ్రులు అరుణ్ రాణాకు ఇచ్చి పెళ్లి చేశారు. దాంతో ఆమె కుట్ర చేసి తప్పించుకుని తన ప్రియుడితో వెళ్లిపోయింది.