అల్లాను స్మరిస్తూ యోగా చేసుకోవచ్చు: కేంద్రం
న్యూఢిల్లీ: అంతర్జాతీయ యోగా దినోత్సవంలో వివాదం తలెత్తకుండా నిరోధించేందుకు వీలుగా ఈ కార్యక్రమం నుంచి సూర్య నమస్కారాన్ని తొలగించిన కేంద్ర ప్రభుత్వం ఈ ఉత్సవంలో శ్లోకాలను వల్లెవేయడం తప్పనిసరి కాదని గురువారం స్పష్టం చేసింది. ఈ కార్యక్రమంలో ముస్లింలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని రాజ్పథ్లో జూన్ 21వ తేదీన నిర్వహించే కార్యక్రమాలకు ‘ఆయుష్' మంత్రిత్వ శాఖ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనే ముస్లింలు శ్లోకాలను ఉచ్ఛరించడానికి బదులుగా తమ ఇష్ట దైవమైన అల్లాను స్మరించుకోవచ్చని ‘ఆయుష్' మంత్రి శ్రీపాద్ నాయక్ స్పష్టం చేశారు.

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించడం పట్ల, ప్రత్యేకించి ఈ కార్యక్రమంలో సూర్య నమస్కారాన్ని పొందుపర్చడం కొన్ని మైనార్టీ సంఘాలు అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముస్లిం సంఘాలకు చెందిన పలువురు ప్రతినిధులు గురువారం వీరు శ్రీపాద్ నాయక్ను కలుసుకున్నారు.
యోగాకు మతంతో సంబంధం లేదని, యోగాను వ్యతిరేకించేవారు మానవత్వానికే శత్రువులని వారు పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో సూర్య నమస్కారాన్ని చేర్చరాదని, ఎవరైనా తేలికగా వేసే ఆసనాలతో అన్ని మతస్తుల ఉమ్మడి కార్యక్రమంగా దీనిని నిర్వహించాలని సంబంధిత కమిటీ నిర్ణయించిందని విదేశీ వహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications