ప్రథమ పౌరుడిగా నా దేశప్రజలకు నేనిచ్చే ఏకైక సందేశం: రాష్ట్రపతిగా కోవింద్ చివరి ప్రసంగం
న్యూఢిల్లీ: భారత 14వ రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్ పదవీకాలం ఆదివారంతో ముగియడంతో ఆదివారం ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. పదవీ విరమణ సందర్భంగా, పదవీ విరమణ చేసిన రాష్ట్రపతి కోవింద్ దేశ పౌరులందరికీ, ఎన్నికైన ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.
భారత్ ప్రపంచంలోనే అత్యంత శ్రేష్ఠమైన దేశాల్లో ఒకటిగా నిలిచేందుకు సిద్ధమవుతోందని రాష్ట్రపతి కోవింద్ అన్నారు. మారుమూల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి రాష్ట్రపతి హోదాలో ప్రసంగిస్తుండటం.. దేశంలోని బలమైన ప్రజాస్వామ్య వ్యవస్థకు నిదర్శనమని అన్నారు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే ఆదర్శాలు ఉన్నతమైనవని.. ఎప్పటికీ అడ్డంకులు కాబోవని స్పష్టం చేశారు.
"నేను రాష్ట్రపతిగా పనిచేసిన ఈ ఐదేళ్ల కాలంలో సమాజంలోని అన్ని వర్గాల ప్రజల నుంచి పూర్తి సహకారం లభించింది. అందరూ నన్ను ఆశీర్వదించారు. మూలాలతో అనుబంధం కొనసాగించడం భారతీయ సంప్రదాయం ప్రత్యేకత. యువత ఈ సంప్రదాయాన్ని కాపాడుకోవాలి. తమ గ్రామాలు, పట్టణాలు, పాఠశాలలు, ఉపాధ్యాయులతో అనుబంధం కొనసాగించాలి' అని రామ్ నాథ్ కోవింద్ వ్యాఖ్యానించారు.
అంతేగాక, పర్యావరణ సంరక్షణపై ప్రధానంగా మాట్లాడారు రాష్ట్రపతి కోవింద్. ప్రకృతి ప్రకోపంపై ఆందోళన వ్యక్తం చేశారు. వాతావరణ సంక్షోభం భూగ్రహ భవిష్యత్ను ప్రశ్నార్థకంగా మార్చేస్తోందన్నారు. రాబోయే తరాల కోసం పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు.
గాలి, నీరు, నేలను మన తర్వాతి తరం కోసం సంరక్షించాలి. రోజువారీ జీవితంలో మనం తీసుకునే నిర్ణయాలు పర్యావరణానికి అనుకూలంగా ఉండేలా చూసుకోవాలి. చెట్లు, నదులు, సముద్రాలు, పర్వతాలు, తోటి ప్రాణుల సంరక్షణకు పాటుపడాలి. ఓ ప్రథమ పౌరుడిగా నా దేశప్రజలకు నేనిచ్చే ఏకైక సందేశం ఏదైనా ఉంటే అది ఇదే' అని రామ్ నాథ్ కోవింద్ స్పష్టం చేశారు.
ఇక, రాష్ట్రపతి హోదాలో తన సొంత గ్రామాన్ని సందర్శించడాన్ని కోవింద్ గుర్తు చేసుకున్నారు. ఆ క్షణాలు తన జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతాయన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ సైతం తమ గ్రామంలో పర్యటించారని ఈ సందర్భంగా తెలిపారు. కాగా, ఇటీవల రాష్ట్రపతి ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము రేపు అంటే సోమవారం(జులై 25న) భారత నూతన రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.