Bipin Rawat : రావత్ మృతిపై మోడీ, రాహుల్ సహా ప్రముఖుల నివాళి- సంతాప ట్వీట్ల వెల్లువ
త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ మృతిపై దేశవ్యాప్తంగా సంతాప సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీలు, ప్రాంతాలు, వర్గాలకు అతీతంగా అందరూ హెలికాఫ్టర్ దుర్ఘటనలో చనిపోయిన బిపిన్ రావత్ తో పాటు 13 మందికి నివాళులు అర్పిస్తున్నారు. ట్విట్టర్ తో పాటు సామాజిక మాధ్యమాల్లో సంతాప సందేశాలు వెల్లువెత్తాయి. ప్రధాని మోడీ, పలువురు కేంద్రమంత్రులతో పాటు ప్రముఖులు నివాళులు అర్పిస్తున్న వారిలో ఉన్నారు. రావత్ మృతి పూడ్చలేని లోటని ఐఏఎఫ్ ప్రకటించింది.
రావత్ మృతిపై దేశం దిగ్భ్రాంతి
ఇవాళ తమిళనాడులోని కూనూర్ లో జరిగిన ఆర్మీ హెలికాఫ్టర్ దుర్ఘటనలో త్రివిధ దళాధిపతిగా ఉన్న జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులికా రావత్, మరో 11 మంది దుర్మరణం పాలయ్యారు. కెప్టెన్ వరుణ్ సింగ్ ఇంకా మృత్యువుతో పోరాడుతున్నారు. రావత్ సహా 13 మంది దుర్మరణం పాలైన ఈ ఘటన దేశాన్ని దిగ్భ్రాంతిలోకి నెట్టింది. ఉదయం ప్రమాదం జరిగిన వెంటనే రావత్ పాటు మరికొందరు బతికొస్తారని భావించిన వారంతా సాయంత్రం కల్లా ఆయన ఇక లేరని ఐఏఎఫ్ చేసిన ప్రకటనతో షాక్ కు గురయ్యారు.
అద్భుతమైన సైనికుడు, దేశభక్తుడన్న మోడీ
బిపిన్ రావత్ మృతిపై ప్రధాని మోడీ కొద్దిసేపటి క్రితం ట్వీట్ చేశారు. ఇందులో ఆయన... జనరల్ బిపిన్ రావత్ అద్భుతమైన సైనికుడు. నిజమైన దేశభక్తుడు, అతను మన సాయుధ దళాలను, భద్రతా యంత్రాంగాన్ని ఆధునీకరించడంలో గొప్పగా దోహదపడ్డాడు. వ్యూహాత్మక విషయాలపై అతని అంతర్ దృష్టులు, దృక్పథాలు అసాధారణమైనవి. ఆయన మృతి నన్ను తీవ్రంగా కలచివేసింది. ఓం శాంతి అంటూ మోడీ వ్యాఖ్యానించారు. మరో ట్వీట్ లో భారతదేశపు మొదటి CDSగా, జనరల్ రావత్ రక్షణ సంస్కరణలతో సహా మన సాయుధ దళాలకు సంబంధించిన విభిన్న అంశాలపై పనిచేశారు. అతను తనతో పాటు ఆర్మీలో పనిచేసిన గొప్ప అనుభవాన్ని తెచ్చుకున్నాడు. ఆయన చేసిన విశేష సేవలను భారతదేశం ఎన్నటికీ మరువదన్నారు.
రావత్ నిబద్ధతకు అమిత్ షా ప్రశంసలు
సీడీఎస్ రావత్ మృతిపై హోంమంత్రి అమిత్ కూడా ట్వీట్ చేశారు. ఇందులో ఆయన... మన CDS, జనరల్ బిపిన్ రావత్ జీని చాలా విషాదకరమైన ప్రమాదంలో కోల్పోయిన దేశానికి చాలా విచారకరమైన రోజు. మాతృభూమికి అత్యంత భక్తిశ్రద్ధలతో సేవ చేసిన వీర సైనికుల్లో ఆయన ఒకరు. అతని ఆదర్శప్రాయమైన సహకారం & నిబద్ధత మాటల్లో చెప్పలేము. నేను తీవ్రంగా బాధపడ్డానన్నారు. శ్రీమతి మధులికా రావత్ మరియు మరో 11 మంది సాయుధ బలగాల విచారకరమైన మరణం పట్ల నా ప్రగాఢ సంతాపాన్ని కూడా తెలియజేస్తున్నాను. నా ఆలోచనలు మృతుల కుటుంబాలతో ఉన్నాయి. ఈ విషాద నష్టాన్ని తట్టుకునే శక్తిని దేవుడు వారికి ప్రసాదించుగాక. అని షా ట్వీట్ లో పేర్కొన్నారు.
రాహుల్ సంతాప ట్వీట్
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కూడా బిపిన్ రావత్ మృతి ఘటనపై ట్వీట్ చేశారు. ఇందులో ఆయన రావత్ తో పాటు మిగతా మృతులకు నివాళులు అర్పించారు. ఇది అపూర్వమైన విషాదం, ఈ కష్ట సమయంలో మా ఆలోచనలు వారి కుటుంబంతో ఉన్నాయి. ప్రాణాలు కోల్పోయిన మిగతా వారందరికీ కూడా హృదయపూర్వక సంతాపం అంటూ రాహుల్ గాంధీ ట్వీట్ లో పేర్కొన్నారు. ఈ దుఃఖంలో భారతదేశం ఐక్యంగా ఉందన్నారు.
Recommended Video
రావత్ లేని లోటు పూడ్చలేనిదన్న రాజ్ నాథ్ సింగ్
రావత్ మృతిపై రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పందించారు. తమిళనాడులో ఈరోజు జరిగిన అత్యంత దురదృష్టకర హెలికాప్టర్ ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మరియు మరో 11 మంది సాయుధ బలగాల ఆకస్మిక మరణం తీవ్ర వేదనకు గురిచేసిందన్నారు. ఆయన అకాల మరణం మన సైనిక బలగాలకు, దేశానికి తీరని లోటన్నారు. ఈ ప్రమాదంలో తమ ఆత్మీయులను కోల్పోయిన వారి కుటుంబాల గురించి నా హృదయం అల్లాడుతోందన్నారు. ప్రస్తుతం వెల్లింగ్టన్లోని మిలిటరీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న కెప్టెన్ వరుణ్ సింగ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని రాజ్ నాథ్ ట్వీట్ లో పేర్కొన్నారు.