సీజేఐ-బార్ కౌన్సిల్ పై విద్యార్ధుల ఆగ్రహం ఫలితం-నేషనల్ లా స్కూల్ కీలక నిర్ణయం..!
నిరుద్యోగుల్ని బొద్దింకలుగా అభివర్ణిస్తూ గతంలో సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యల తర్వాత ఆయనపై విద్యార్ధుల్లో ఆగ్రహం కనిపిస్తోంది. దీంతో ఆయన్ను తమ విద్యాసంస్థల్లో నిర్వహించే స్నాతకోత్సవాలతో పాటు ఇతర కార్యక్రమాలకు హాజరు కావడంపై వారు అభ్యంతరాలు చెప్పడం ప్రారంభించారు. ఈ వివాదంలో జోక్యం చేసుకున్న బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ మనన్ మిశ్రా.. వారిని లాయర్లుగా నమోదు చేయకుండా ఇచ్చిన ఆదేశాలు మరింత వివాదాస్పదం అయ్యాయి. దీంతో సీజేఐ సూర్యకాంత్ తో పాటు బార్ కౌన్సిల్ ఛైర్మన్ మనన్ మిశ్రాపైనా న్యాయ విద్యార్ధుల్లో ఆగ్రహం కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలో తాజాగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముందుగా ముంబైలోని టాటా ఇన్ స్టిట్యూట్ కు ఛీఫ్ జస్టిస్ సూర్యకాంత్ రాకపై విద్యార్ధులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆ కార్యక్రమాన్ని రద్దు చేశారు. అనంతరం హైదరాబాద్ నల్సార్ లా యూనివర్సిటీ విద్యార్ధులు కూడా ఇలా ఛీఫ్ జస్టిస్ రాకపై అభ్యంతరాలు చెప్పడంతో బార్ కౌన్సిల్ ఛైర్మన్ జోక్యం చేసుకుని వారిని భవిష్యత్తులో లాయర్లుగా నమోదు చేయొద్దంటూ ఆదేశాలు ఇచ్చారు. ఇవి వివాదాస్పదం కావడంతో గంటలోనే వెనక్కి తగ్గారు. ఆ తర్వాత బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ (NLSIU) విద్యార్ధులు అభ్యంతరం చెప్పారు.

వచ్చే నెల 12న నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా (National Law School) యూనివర్సిటీ స్నాతకోత్సవం జరగాల్సి ఉంది. దీనికి సీజేఐ హాజరుపై విద్యార్ధుల అభ్యంతరాల నేపథ్యంలో అనివార్య పరిస్థితులను కారణంగా చూపుతూ తన 34వ వార్షిక స్నాతకోత్సవాన్ని రద్దు చేసింది. ఇవాళ జారీ చేసిన అధికారిక ప్రకటనలో విశ్వవిద్యాలయం ఈ నిర్ణయం గురించి పట్టభద్రులవుతున్న విద్యార్థులకు తెలియజేసింది. తీవ్ర ప్రయత్నాలు చేసినా ప్రణాళిక ప్రకారం వార్షిక స్నాతకోత్సవాన్ని నిర్వహించలేమని విశ్వవిద్యాలయం తెలిపింది. అయితే ఈ కార్యక్రమం రద్దు అయినప్పటికీ, విద్యార్థులు తమ డిగ్రీలను మాత్రం అందిస్తామని తెలిపింది. దీనర్ధం విద్యార్థులు తమ డిగ్రీలను లాంఛనంగా స్వీకరించడానికి భౌతికంగా స్నాతకోత్సవ కార్యక్రమానికి హాజరు కావాల్సిన అవసరం లేదు.














Click it and Unblock the Notifications