హిజాబ్ మద్దతుదారులంతా అల్ ఖైదాయే- జాతీయ మీడియా ఛానల్ అత్యుత్సాహం-ఫైన్, మందలింపు
కర్నాటకలో తలెత్తిన హిజాబ్ ధారణ వివాదంపై సుప్రీంకోర్టులో ఓవైపు విచారణ కొనసాగుతుండగానే దీనిపై ఓ జాతీయ మీడియా ఛానల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. న్యూస్ 18 ఇండియా ఛానల్ యాంకర్ ఓ చర్చ సందర్భంగా హిజాబ్ మద్దతుదారులంటూ అల్ ఖైదా వారేనంటూ వ్యాఖ్యానించారు. దీనిపై న్యూస్ బ్రాడ్ కాస్టింగ్, డిజిటల్ స్టాండర్డ్స్ అథారిటీ (NBDSA) ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ ఏడాది ఆరంభంలో కర్నాటకలో హిజాబ్ వివాదం రేగుతున్న సమయంలో న్యూస్ 18 ఇండియా ఛానల్ యాంకర్ అమన్ చోప్రా ఓ చర్చ సందర్భంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. దీనిపై పలు ఫిర్యాదులు రావడంతో NBDSA స్పందించింది. వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తాప్రసారాల ప్రమాణాల్ని ఉల్లంఘించినందుకు ఛానల్ కు రూ.50 వేల జరిమానా విధించింది. అంతే కాకుండా సదరు యాంకర్ కు సరైన శిక్షణ ఇవ్వాలని కూడా ఛానల్ కు సూచించింది.
టెలివిజన్ న్యూస్ ఛానెళ్ల స్వతంత్ర సంస్థ అయిన NBDSA.. యాంకర్ అమన్ చోప్రా 'పరస్పర అగౌరవంగా' ప్రవర్తించాడని, ఐదుగురు యువతులకు మద్దతిచ్చే ప్యానెలిస్ట్లను కలుపుతూ మతపరమైన రంగులు అద్దడం ద్వారా నైతిక నియమావళిని ఉల్లంఘించాడని పేర్కొంటూ షోను తీసివేయాలని వార్తా ఛానెల్ని కోరింది.
విద్యార్థులు హిజాబ్ ధరించడానికి మద్దతిస్తూ మాట్లాడిన ప్యానెలిస్టులను అల్ ఖైదా నాయకుడు జవహిరితో లింక్ చేయడమే కాకుండా.. వారిని 'జవహిరి ముఠా సభ్యులు', 'జవహిరి అంబాసిడర్', 'జవహిరి మీ దేవుడు, నువ్వే అతని అభిమాని' అంటూ సదరు యాంకర్ వ్యాఖ్యలు చేసాడు. ఇందులో వారికి అల్ ఖైదాతో ఎలాంటి లింకులు ఉన్నట్లు నిర్దారణ కాలేదు. 'అల్ఖైదా గ్యాంగ్ఎక్స్పోజ్డ్', 'హిజాబ్ కా ఫటా పోస్టర్, నిక్లా అల్ ఖైదా', 'హిజాబ్ వెనుక దొరికిన అల్ జవహిరి', 'హిజాబ్ వివాదాన్ని అల్ ఖైదా ప్లాన్ చేసింది' అంటూ టిక్కర్లను కూడా ఛానెల్ ప్రసారం చేసింది. దీనిపైనా NBDSA ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై ఇంద్రజీత్ ఘోర్పడే అనే టెక్ ఎథిక్స్ ప్రొఫెషనల్ దాఖలుచేసిన ఫిర్యాదుపై చర్యలు ప్రకటించింది.