యూపీలో చేతులు కలిపిన ఎస్పీ, ఎన్సీపీ-అసెంబ్లీ పోరులో బీజేపీ ఓటమే లక్ష్యంగా పావులు
వచ్చే ఏడాది జరిగే ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలకు విపక్షాలు రంగం సిద్దం చేసుకుంటున్నాయి. వచ్చే ఎన్నికల్లో అధికార బీజేపీని ఓడించేందుకు వ్యూహరచన చేస్తున్నాయి. ఇందులో భాగంగా శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీతో విపక్ష సమాజ్ వాదీ పార్టీ పొత్తు పెట్టుకోనుంది.
వచ్చే ఏడాది జరిగే యూపీ అసెంబ్లీ పోరులో బీజేపీని మట్టికరిపించేందుకు ఉమ్మడిగా పోటీ చేయాలని ఎన్సీపీ, ఎస్పీ నిర్ణయించాయి. ఈ మేరకు ఇరు పార్టీల అధినేతలు శరద్ పవార్, అఖిలేష్ యాదవ్ ఫోన్ సంభాషణలో నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత పరిస్దితుల్లో విపక్షాల మధ్య ఐక్యత ఉంటే తప్ప బీజేపీని ఓడించడం సాధ్యం కాదని భావిస్తున్నఇరు పార్టీలు... యూపీ పోరు కోసం చేతులు కలపాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
Recommended Video
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు భావసారూప్య పార్టీలతో చేతులు కలపనున్నట్లు శరద్ పవార్ ప్రకటించారు. అఖిలేష్ యాదవ్ తో జరిగిన చర్చల్లో ఏ పార్టీ ఎన్ని సీట్లు తీసుకోవాలనే అంశంపై మాత్రం చర్చించలేదు. త్వరలో తమతో కలిసి వచ్చే ఇతర విపక్షాలతో కూడా పొత్తు పెట్టుకున్నాక సీట్ల కేటాయింపుపై నిర్ణయం తీసుకునే అవకాశముంది. ప్రస్తుతం యూపీలో యోగీ సర్కార్ పై ప్రజా వ్యతిరేకత అంతకంతకూ పెరుగుతోంది. కరోనా నియంత్రణలో వైఫల్యాలతో పాటు మైనార్టీలను లక్ష్యంగా చేసుకోవడంపై ఆగ్రహంగా ఉన్న విపక్షాలు బీజేపీకి వ్యతిరేకంగా ఏకమవుతున్నాయి.