భారత్కు నేపాల్ నేపాల్ భారీ ఝలక్.. న్యూస్ చానెళ్లపై నిషేధం.. పతనం అంచుల్లో ప్రధాని ఓలి..
చైనాతో సరిహద్దు వివాదం తాత్కాలికంగానైనా తెరపడిందనుకునే లోపే నేపాల్ తోకజాడింపులు వేగవంతం చేసింది. ఇండియా భూభాగాన్ని తనదిగా ప్రకటించుకున్న ఈ హిమాలయ దేశం.. ఇప్పుడు ఇండియాకు చెందిన అన్ని న్యూస్ చానెళ్లపై నిషేధం విధించింది. పరిస్థితులు చూస్తే నిషేధం టీవీ చానెళ్లతో ఆగిపోయేలా లేదు. మరోవైపు ఇండియాతో విభేదాల విషయంలో నేపాల్ అధికార కమ్యూనిస్టు పార్టీ రెండుగా చీలిపోవడం, చర్చలు ఎంతకీ సఫలం కాకపోవడంతో ప్రధాని కేపీశర్మ ఓలి పరిస్థితి పతనం అంచుల్లో నిల్చున్నట్లు తయారైంది. వివరాల్లోకి వెళితే..

వ్యూహాత్మకంగా ప్రకటన..
రాకపోకలకు వీసా కూడా అవసరం లేనంత స్నేహంగా కొనసాగిన భారత్, నేపాల్ మధ్య చైనా ఎంట్రీతో దూరం పెరుగుతూ రావడం, వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వద్ద చైనా కవ్విపులకు పాల్పడిన సమయంలోనే నేపాల్ కూడా భారత భూభాగంలోని మూడు కీలక ప్రాంతాలను తనదిగా పేర్కొంటూ కొత్త మ్యాపులు తయారు చేయడం, ఆ మేరకు రాజ్యాంగ సవరణ కూడా చేపట్టడం తెలిసిందే. తాజాగా భారతీయ న్యూస్ చానెళ్లను నిషేధించే విషయంలోనూ నేపాల్ వ్యూహాత్మకంగా అడుగులు వేసింది..

పార్టీ నేత.. ఆ వెంటనే ఎంఎస్వోలు..
భారతీయ న్యూస్ చానెళ్లలో ప్రసారమవుతోన్న కథనాలు నేపాలీల మనోభావాలను గాయపరుస్తున్నాయని, ప్రజల అభ్యర్థన మేరకు గురువారం నుంచి అన్ని చానెళ్ల ప్రసారాలను నిలిపేస్తున్నామని మల్టీ సిస్టమ్ ఆపరేటర్లు(ఎంఎస్వో)లు ప్రకట చేశారు. ఇదే అంశంపై నేపాల్ కమ్యూనిస్టు పార్టీ(ఎన్సీపీ) అధికార ప్రతినిధి నారాయణ శ్రేష్ట ట్వీట్ చేసిన కొద్ది గంటలకే ఎంఎస్వోలు తమ నిర్ణయాన్ని ప్రకటించడం గమనార్హం. ఇండియన్ మీడియా అదే పనిగా నేపాల్ పై విషం కక్కుతోందని, హద్దులు మీరిన కథనాలు, అసత్య ప్రచారాలు సాగిస్తున్నదని, దీనిపై భారతీయ అధికారులు తన నిరసన కూడా తెలియజేశానని ఎన్సీపీ నేత శ్రేష్ట పేర్కొన్నారు.

పీఎంవో అధికారిక ప్రకటన..
ఇండియన్ న్యూస్ చానెళ్ల ప్రసారాలను నిలిపేస్తున్నట్లు ఎంఎస్వోలు ప్రకటించిన మరికొన్ని గంటలకే నేపాల్ ప్రధానమంత్రి కార్యాలయం దీనిపై అధికారిక స్పందించింది. ‘‘ఇండియన్ మీడియాలో వస్తోన్న కథనాలు, వ్యాఖ్యలన్నీ నేపాల్ ప్రభుత్వానికి విరుద్ధంగా, చాలా అభ్యంతరకరంగా ఉంటున్నాయి. వీటిని మేం ఖండిస్తున్నాం. జర్నలిజం నీతి తెలిసినవాళ్లెవరూ ఇలాంటి రిపోర్టులు చేయరు..''అని ప్రధాని సలహాదారుడైన బిషుల్ రమాల్ ఒక ప్రకటన చేశారు.

ఓలీ వర్సెస్ ప్రచండ
ఇండియాతో విభేదాల విషయంలో నేపాల్ కమ్యూనిస్టు పార్టీలో భారీ చీలక ఏర్పడింది. ప్రధాని కేపీ శర్మ ఓలి వర్గం ఒకవైపు.. పార్టీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పుష్ప కమాల్ దహల్ అలియాస్ ప్రచండ మరోవైపుకు వేరైపోయారు. చిరకాల మిత్రురాలైన ఇండియాతో కక్షపూరితంగా, ఘర్షణాత్మకంగా వ్యవహరించడం సరికాదని, సరిహద్దు సమగ్రత అంశంలో తాము ఓలీకి మద్దతు పలుకుతాం కానీ ఆయన చైనా మాటను అతిగా వినడం మానుకోవాలని ప్రచండ వర్గం వాదిస్తోంది. నేపాల్ లో చైనా రాయబారి హూ యుంకాయ్ చెప్పినట్టల్లా ప్రధాని ఓలీ నిర్ణయాలు తీసుకుంటుండటం నేపాల్ భవిష్యత్తుకు మంచిదికాదని ప్రచండ వర్గం నేతలు వ్యాఖ్యానించారు. అదీగాక, పార్లమెంట్ సమావేశాలను ఏకపక్షంగా నిరవధిక వాయిదా వేయడంపైనా ప్రచండ ఫైరయ్యారు. ఓలి రాజీనామా చేయాల్సిందేనని పట్టుపట్టారు.
Recommended Video

పార్టీ చీలితే ఓలీ ఔట్..
తనపై పార్టీలో రగులుతోన్న అసంతృప్తిని చల్లార్చేందుకు ప్రధాని కేపీ శర్మ ఓలి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికి పలుమార్లు ప్రచండతో ఫేస్ టు ఫేస్ మాట్లాడినా ఫలితం రాలేదు. దీంతో, 45 మంది సభ్యులుండే స్టాండింగ్ కమిటీపై తుది నిర్ణయం తీసుకునే బాధ్యత పడింది. ఇప్పటికే నాలుగు సార్లు వాయిదా పడిన స్టాండింగ్ కమిటీ భేటీ శుక్రవారం జరగనుంది. ఇప్పటివరకు చోటుచేసుకున్న పరిణామాలను బట్టి నేపాల్ కమ్యూనిస్టు పార్టీలో చీలక తప్పేలా లేదు. అదే జరిగితే కేపీ శర్మ ఓలి ప్రధాని పదవి నుంచి దిగిపోకతప్పదు.












Click it and Unblock the Notifications