నేపాల్ దుస్సాహాసం... బీహార్ భూభాగంపై కన్ను... ఏక కాలంలో భారత్ పైకి రెండు దేశాలు...
ఓవైపు చైనా దూకుడుకు సరిహద్దుల్లో ఎలా అడ్డుకట్ట వేయాలని భారత్ సమాలోచనలు జరుపుతుండగానే... మరోవైపు నేపాల్ కూడా అదే స్థాయి దూకుడును ప్రదర్శిస్తోంది. ఇప్పటికే భారత భూభాగంలోని లిపులేఖ్, కాలాపానీ, లింపియధురా ప్రాంతాలను తమవిగా పేర్కొన్న నేపాల్.. తాజాగా మరో దుస్సాహాసానికి ఒడిగట్టింది. బీహార్ చంపారా జిల్లాలో ఉన్న ప్రాంతంలో భారత్ చేపట్టిన అభివృద్ది పనులను అడ్డుకుంది. అంతేకాదు,ఆ ప్రాంతాన్ని 'నో మ్యాన్స్ ల్యాండ్(ఎవరికీ చెందనిది)'గా పేర్కొంది. దీంతో భారత్ ఏక కాలంలో అటు చైనాను,ఇటు నేపాల్ను ఎదుర్కొనేందుకు వ్యూహాలు రచించాల్సిన అవసరం ఏర్పడింది.
Recommended Video

గాల్వన్లో ఘర్షణ చోటు చేసుకున్న రోజే...
లదాఖ్ సరిహద్దులోని గాల్వన్ వ్యాలీలో జూన్ 15న భారత్-చైనా సైన్యం మధ్య ఘర్షణలు తలెత్తి ఇరువైపులా ప్రాణ నష్టం సంభవించిన సంగతి తెలిసిందే. యాధృచ్చికంగా అదే రోజు నేపాల్ కూడా దుస్సాహాసానికి ఒడిగట్టింది. ఈస్ట్ చంపారన్ జిల్లాకు 45కి.మీ దూరంలోని మోతీహరి పట్టణానికి ఆనుకుని ఉన్న లాల్ బకె నది ప్రాంతంలో బీహార్ ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాలను అడ్డుకుంది. నేపాల్ అధికారులు జోక్యం చేసుకుని... అక్కడ పనులు ముందుకు సాగకుండా అడ్డుకున్నారు.

స్థానికంగానే పరిష్కరించాలనుకున్నప్పటికీ...
నిజానికి ఈ వివాదాన్ని స్థానికంగానే పరిష్కరించాలని భావించినప్పటికీ ఆ ప్రయత్నాలేవీ ఫలించలేదు. దీంతో విషయాన్ని బీహార్ అధికారులు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకొచ్చారు. 'బీహార్లోని చంపారన్ జిల్లాలో నది ఆనకట్టకు సంబంధించిన నిర్మాణాన్ని నేపాల్ అడ్డుకుంది.ఈ విషయాన్ని బీహార్ ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వానికి నివేదించాం. త్వరలోనే ఈ సమస్య పరిష్కారం అవుతుందని భావిస్తున్నాం.' అని చంపారన్ జిల్లా మెజిస్ట్రేట్ శిర్షత్ కపిల్ అశోక్ తెలిపారు.

జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు...
జిల్లా మెజిస్ట్రేట్ ఇదే విషయాన్ని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు కూడా ఫిర్యాదు చేశారు. నేపాల్ నీటి పారుదల శాఖ అధికారులతోనూ దీనిపై సంప్రదింపులు జరిపినప్పటికీ.. ఆ చర్చలేవీ సఫలం కాలేదన్నారు. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తే ఆనకట్టను పూర్తి చేయవచ్చునని కోరారు. నేపాల్ తాజా చర్య వెనుక దురాక్రమణ చేసే ఉద్దేశమే ఉన్నట్టు కనిపిస్తోంది. అదే నిజమైతే నేపాల్తోనూ మున్ముందు భారత్ దూకుడుగా వ్యవహరించక తప్పదు.

కొనసాగుతున్న ఉద్రిక్తతలు...
లదాఖ్లోని గాల్వన్ వ్యాలీలో భారత్-చైనా మధ్య ఇప్పటికీ ఉద్రిక్తతలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇరువైపులా ఈరోజు వెయ్యి మంది సైన్యాన్ని రెండు దేశాలు మోహరించాయి. జూన్ 15 తర్వాత మళ్లీ ఎలాంటి హింసాత్మక ఘర్షణలు చోటు చేసుకోనప్పటికీ... ఉద్రిక్త వాతావరణం మాత్రం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఇరు దేశాల కమాండర్స్ మధ్య చర్చలు జరిగాయి. ఈ చర్చలకు సంబంధించిన విషయాలు ఇంకా బయటకు రావాల్సి ఉంది.












Click it and Unblock the Notifications