పెట్రోల్ బంకుల్లో కొత్త రూల్స్. తక్షణమే అమల్లోకి, మోసాలకు కేంద్రం చెక్
పెట్రోల్ బంకుల్లో లేదా గ్యాస్ స్టేషన్లలో ఇంధనం నింపేటప్పుడు కొలతల్లో మోసాలు జరగకుండా, వినియోగదారులకు తాము చెల్లించిన ప్రతి రూపాయికి సరిపడా ఖచ్చితమైన ఇంధనం అందేలా కేంద్ర ప్రభుత్వం ఒక కీలక అడుగు వేసింది. లావాదేవీలలో మరింత పారదర్శకతను పెంచడం, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉన్న పనిభారాన్ని తగ్గించడం లక్ష్యంగా.. కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మే 24, 2026న 'లీగల్ మెట్రాలజీ (ప్రభుత్వ ఆమోదిత పరీక్షా కేంద్రం) నిబంధనలు, 2013'ను అధికారికంగా సవరించింది. ఈ కొత్త మార్పు ద్వారా ఇకపై ప్రభుత్వ ఆమోదిత పరీక్షా కేంద్రాలు (GATCs) దేశవ్యాప్తంగా ఉన్న పెట్రోల్, డీజిల్, సీఎన్జీ (CNG), ఎల్పీజీ (LPG), ఎల్ఎన్జీ (LNG), హైడ్రోజన్ పంపిణీ యంత్రాల (Dispensing Units) ఖచ్చితత్వాన్ని తనిఖీ చేసి, ధృవీకరించనున్నాయి.
భారతదేశ ఇంధన రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సాంప్రదాయ ఇంధనాలతో పాటు స్వచ్ఛమైన ఇంధనాల (Clean Fuels) వినియోగం విపరీతంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే జిఎటిసి (GATC) ఫ్రేమ్వర్క్ పరిధిలోకి సీఎన్జీ, ఎల్ఎన్జీ, హైడ్రోజన్ పంపిణీ యంత్రాలను కూడా చేర్చాల్సి వచ్చిందని అధికారులు వివరించారు.
ఈ చారిత్రాత్మక చర్య వల్ల దేశవ్యాప్తంగా ఇంధన కొలతల ధృవీకరణ సేవలు వేగవంతం కావడమే కాకుండా, పర్యావరణహిత ఇంధనాల విస్తృత వినియోగానికి ఎంతో మద్దతు లభిస్తుందని వినియోగదారుల వ్యవహారాలు, ఆహార & ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ తాజా ఐదు ఇంధన వ్యవస్థల చేరికతో.. GATCలు ధృవీకరించే మొత్తం తూనికలు, కొలతల పరికరాల జాబితా సంఖ్య 18 నుండి 23కు పెరిగింది.

ఫిక్స్డ్ ఫీజులు.. ప్రైవేట్ భాగస్వామ్యం!
కొత్త నిబంధనల అమలులో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ధృవీకరణ రుసుములను (Verification Fees) కూడా ప్రామాణీకరించింది. సవరించిన నిబంధనల ప్రకారం.. పెట్రోల్, డీజిల్ పంపిణీ యంత్రాల తనిఖీ కోసం ప్రతి నాజిల్ (Nozzle) కు రూ.5,000 రుసుముగా నిర్ణయించారు. అలాగే సీఎన్జీ, ఎల్పీజీ, ఎల్ఎన్జీ, హైడ్రోజన్ పంపిణీ యంత్రాలకు సంబంధించి ప్రతి నాజిల్కు రూ.10,000 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. లీగల్ మెట్రాలజీ చట్టం ప్రకారం అవసరమైన సాంకేతిక నైపుణ్యం, ల్యాబ్ సౌకర్యాలు ఉన్న ప్రైవేట్ ప్రయోగశాలలు, పరిశ్రమలు కూడా ఈ GATCల ధృవీకరణ ప్రక్రియలో భాగస్వామ్యం అయ్యేలా ఈ సరికొత్త నిర్మాణాన్ని రూపొందించడం విశేషం.
రాష్ట్రాలకు అదనపు అధికారాలు.. తగ్గిన జాప్యం!
ఈ సవరణల ద్వారా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా మరింత సౌలభ్యాన్ని, అధికారాలను కల్పించింది. స్థానిక అవసరాలకు అనుగుణంగా తమ నిబంధనల కింద GATCల ద్వారా అదనపు కేటగిరీలను నోటిఫై చేసే అధికారం ఇకపై రాష్ట్రాలకు ఉంటుంది. దీనివల్ల క్షేత్రస్థాయిలో ధృవీకరణ సేవలను మరింత విస్తరించడానికి వీలవుతుంది. అంతేకాకుండా, పరిపాలనా సామర్థ్యాన్ని మెరుగుపరిచి, పనుల్లో జాప్యాన్ని తగ్గించేందుకు వీలుగా.. సంయుక్త కార్యదర్శి (Joint Secretary), ఆ పై స్థాయి అధికారులకు నిబంధనలలోని సంబంధిత అధికారాలను ఉపయోగించుకునే అవకాశం కల్పించారు. ఇది ఆమోద ప్రక్రియలను వేగవంతం చేస్తుంది.
దేశవ్యాప్తంగా తూనికలు, కొలతల పరికరాలకు సకాలంలో, నమ్మదగిన సర్టిఫికేషన్ అందించడంలో GATCలు ఇప్పటికే కీలక పాత్ర పోషిస్తున్నాయని కేంద్రం పేర్కొంది. ఇప్పుడు వీటి పరిధిని మరింత విస్తరించడం వల్ల.. రాష్ట్ర లీగల్ మెట్రాలజీ విభాగాలు కేవలం తనిఖీలు చేయడం, నిబంధనల అమలును పర్యవేక్షించడం, వినియోగదారుల నుండి వచ్చే ఫిర్యాదుల త్వరితగతిన పరిష్కారంపై మరింత ఎక్కువ దృష్టి పెట్టడానికి అవకాశం లభిస్తుంది.














Click it and Unblock the Notifications