భారత్ లో కరోనా భయానక రికార్డ్ , 24 గంటల్లో 4.12 లక్షల కేసులు, 3,980 మరణాలు
భారతదేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. నిత్యం లక్షల్లో కేసులు నమోదు అవుతుంటే,వేలల్లో ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. భారతదేశంలో గత 24 గంటల్లో 3,980 మంది మరణించారు. ఇది ఇప్పటివరకు ఒక రోజులో అత్యధికంగా నమోదైన మరణాల సంఖ్య. దీంతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా నమోదైన మరణాలు 2,30,168 కు చేరుకున్నాయి.
రోజువారీ కేసుల్లో భారత్ రికార్డ్ బ్రేక్ ..4,12,262 కొత్త కేసులు
భారత దేశంలో ఇప్పటి వరకు ప్రపంచంలో ఎప్పుడూ, ఎక్కడా నమోదు కానంతగా ఈ ఒక్కరోజు కరోనా కేసులు నమోదయ్యాయి . భారతదేశంలో రోజువారీ కరోనా కేసులు గత 24 గంటల్లో 4.12 లక్షలు నమోదు కావడం కొత్త భయంకరమైన రికార్డు అని చెప్పక తప్పదు. గత 24 గంటల్లో భారతదేశంలో 4,12,262 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇప్పటివరకు తాజా కేసులు తో కలిపి దేశవ్యాప్తంగా మొత్తం నమోదైన కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 2,10,77,410.

కరోనా యాక్టివ్ కేసులు 35,66,398
నిన్న ఒక్కరోజే 3,29,113 మంది కరోనా మహమ్మారి బారినుండి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో కరోనా యాక్టివ్ కేసులు 35,66,398 గా ఉన్నాయి.కరోనా సెకండ్ వేవ్ విజృంభణ లో భాగంగా గురువారం 4 లక్షల మార్కును దాటడానికి ముందు రెండు వారాలలో ఒక్కరోజులో 300,000 కేసులను నమోదు చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,72,80,844 మంది ఈ మహమ్మారి నుండి కోలుకున్నారు . ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 16,25,13,339 మందికి టీకాలు వేసినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. వీరిలో 19,55,733 మందికి గత 24 గంటల్లో వ్యాక్సినేషన్ చేశారు.
పన్నెండు రాష్ట్రాల్లో లక్ష దాటిన క్రియాశీల కేసులు
అయితే దేశంలో థర్డ్ వేవ్ కూడా రాబోతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రజలు సామాజిక దూరాన్ని పాటించటం, మాస్కులు ధరించడం వంటి చర్యలతో కరోనా థర్డ్ వేవ్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, ఉత్తర ప్రదేశ్ సహా పన్నెండు రాష్ట్రాల్లో 1 లక్షకు పైగా క్రియాశీల కొవిడ్-19 కేసులు ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. దేశ వ్యాప్తంగా 30 జిల్లాలలో గత రెండు వారాలుగా కరోనావైరస్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి.
Recommended Video
30 జిల్లాలలో కరోనా కేసుల పెరుగుదల , మహారాష్ట్రలో తాజా పరిస్థితి ఇదే !!
ఈ జిల్లాల్లో పది కేరళలో, ఏడు ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో మూడు, తమిళనాడులో ఒకటి ఉన్నాయని కేంద్రం వెల్లడించింది.మహారాష్ట్ర గత సంవత్సరం మహమ్మారి ప్రారంభం నుండి అత్యంత నష్టపోయిన రాష్ట్రంగా ఉంది . కోవిడ్-19 మహమ్మారి కారణంగా 920 కొత్త మరణాలు,57,000 కొత్త కేసులు తాజాగా నమోదయ్యాయి. రాజధాని ముంబైలో 3,879 కొత్త కేసులు, 77 మరణాలు నమోదయ్యాయి. పూణేలో 9,084 కేసులు, 93 మరణాలు నమోదయ్యాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 6.41 లక్షల క్రియాశీల కేసులు ఉన్నాయి.












Click it and Unblock the Notifications