ప్రధాన నగరాల్లో సంపూర్ణ లాక్డౌన్: జెట్ స్పీడ్తో కొత్త కేసులు: మూడు లక్షల మార్క్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా కేసులు భయానకంగా పెరుగుతున్నాయి. ఇదివరకు 20 వేల లోపే నమోదయ్యే కొత్త కేసుల సంఖ్య ఉన్నట్టుండి పెరుగుదల బాట పట్టింది. రోజురోజుకూ జెట్ స్పీడ్తో పరుగులు పెడుతోంది. అనేక రాష్ట్రాల్లో కరోనా తీవ్రత కనిపిస్తోంది. పార్కులు వంటి బహిరంగ ప్రదేశాలను మూసివేస్తున్నారు. వారాంతపుర రోజుల్లో లాక్డౌన్ను అమలు చేస్తున్నారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లోని కొన్ని ప్రధాన నగరాల్లో ఆదివారం నాడు సంపూర్ణ లాక్డౌన్ అమల్లోకి వచ్చింది. దీన్ని మరింత విస్తరించే అవకాశాలు లేకపోలేదు.

43 వేలకు పైగా
ఈ పరిణామాల మధ్య దేశవ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో కొత్తగా 43,846 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మధ్యకాలంలో ఈ స్థాయిలో కొత్త కేసులు వెలుగులోకి రావడం ఇదే తొలిసారి. 197 మంది మరణించారు. 22,956 మంది ఆసుపత్రులు, కోవిడ్ కేర్ సెంటర్ల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,15,99,130 చేరుకుంది.
ఇందులో 1,11,30,288 మంది డిశ్చార్జ్ కాగా.. 1,59,755 మంది మరణించారు. యాక్టివ్ కేసుల సంఖ్య 3,09,087కు చేరింది. యాక్టివ్ కేసులు మూడు లక్షల మార్క్ను అధిగమించడం ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పటిదాకా 4,46,03,841 మందికి వ్యాక్సిన్ వేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు.

కరోనా మరణాల్లో టాప్-6 కంట్రీస్ ఇవే..
ప్రపంచ దేశాల్లో కరోనా మృతుల సంఖ్యో భారత్ మూడో స్థానంలో కొనసాగుతూనే ఉంది. అమెరికా, బ్రెజిల్ తరువాత ఆ స్థాయిలో మరణాలు సంభవించింది భారత్లోనే. అమెరికా-5,54,871, బ్రెజిల్-2,92,856 మంది మరణించారు. భారత్లో 1,59,755 మంది మృతి చెందారు. ఈ మూడు దేశాలతో పాటు మెక్సికో, బ్రిటన్, ఇటలీల్లో లక్షమందికి పైగా మరణించారు. మెక్సికోలో 1,97,827, ఇటలీలో 1,04,642 మంది కరోనా కాటుకు బలి అయ్యారు. బ్రిటన్లో ఇప్పటికే కరోనా సోకి 1,26,122 మంది మృతి చెందారు.

మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లల్లో సంపూర్ణ లాక్డౌన్
రోజువారీ కరోనా వైరస్ పాజిటివ్ కేసుల పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లోని పలు నగరాల్లో ఆదివారం నాడు సంపూర్ణ లాక్డౌన్ విధించారు. నాగ్పూర్లో సంపూర్ణ లాక్డౌన్ కొనసాగుతోంది. భోపాల్, జబల్పూర్లల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. త్వరలో బెంగళూరులోనూ వారాంతపు రోజుల్లో లాక్డౌన్ విధించే అవకాశాలు లేకపోలేదు.
ఇప్పటికే పార్కులు, జిమ్ కేంద్రాలు, స్విమ్మింగ్ పూల్లను మూసివేయాలని బెంగళూరు మహానగరల పాలికె అధికారులు నిర్ణయించారు. దీనిపై ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడొచ్చు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి దేశంలోని చాలా రాష్ట్రాల్లో కరోనా మార్గదర్శకాలు అమల్లోకి వస్తాయని సమాచారం.